చింతలపాలెం, జూలై 6 : పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు, నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయలేదంటూ సోమవారం జెన్కో మెయిన్ గేటు వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం గత 16 సంవత్సరాలుగా తాము కాంట్రాక్టు ప్రాతిపదికనే విధులు నిర్వహిస్తున్నామన్నారు. తమకు గతంలో ఇచ్చిన హామీ మేరకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని, తొలగించిన 12 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు వల్ల నష్టపోయిన స్థానిక కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో రామగుండం నుంచి రప్పించిన ఆర్టిజన్లను నియమించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో స్థానిక ఎస్సై పరమేష్ సిబ్బందితో వచ్చి కాంట్రాక్టు ఉద్యోగులతో, జెన్కో అధికారులతో మాట్లాడారు. ఎస్ఈ దేశ్యా నాయక్ మాట్లాడుతూ ఉద్యోగుల కాంట్రాక్టు గడువు ముగిసిందని, వారి ఉద్యోగాలు కొనసాగించేలా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుత నిర్ణయం తమ పరిధిలో లేదన్నారు.
చర్చలు ఫలించకపోవడంతో ఆందోళన చేస్తున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అన్నింటినీ కోల్పోయామని, అప్పుడు ఇచ్చిన హామీలు సైతం అమలు చేయలేదని, దీంతో చివరకు ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా వారి ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు.