రామగిరి, ఫిబ్రవరి 6 : క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉండి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారికి ఉచితంగా న్యాయ సహాయం కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తామని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస్. జగ్జీవన్కుమార్ తెలిపారు. నల్లగొండ కోర్టు భవన సముదాయంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ న్యాయవాదుల కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, బాలలు, పేదలకు జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలకు న్యాయ సాయం కోసం ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇలాంటి వారంతా దీనిలో సంప్రదించి ఉచిత సేవలు పొందవచ్చని వెల్లడించారు. ప్రతి పేదవాడికి ఉచిత న్యాయ సేవలు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ్ధ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయమూర్తులు జయరాజు, తిరుపతి, కీర్తీచంద్రికరెడ్డి, శ్రీవాణి, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది నిమ్మల భీమార్జున్రెడ్డి, డిప్యూటీ కౌన్సిల్ న్యాయవాది మిర్యాల లెనిన్బాబు, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ మామిడి ప్రమీల, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు.