నల్లగొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం సాయంత్రం నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎంజీ యూనివర్సిటీ మొదలు క్లాక్టవర్ సెంటర్ వరకు ఎక్కడా నిరుద్యోగుల జాడే లేదు. కార్యకర్తలు సైతం అంతంతమాత్రంగానే హాజరవడంతో తూతూమంత్రంగా కార్యక్రమం ముగించారు. పేరుకు నిరుద్యోగుల నిరనస ర్యాలీ అయినా కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ నిరుద్యోగుల మధ్య సాగిన ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. వద్దంటే నల్లగొండకు వచ్చిన రేవంత్రెడ్డికి జిల్లా ముఖ్యులు సహాయ నిరాకరణ ప్రకటించారు. ఎంజీయూ వద్ద, నల్లగొండలో సాగిన ర్యాలీలోనూ జిల్లా ముఖ్యులెవ్వరూ రేవంత్రెడ్డితో లేరు. కేవలం క్లాక్టవర్ సెంటర్లో సభా వేదికపైనే కనిపించినా, ఎవరికి వారే పై చేయి కోసం సొంత డబ్బాకే ప్రాధాన్యమిచ్చారు. దాంతో సభకు వచ్చిన కొద్దిమంది శ్రేణులు సైతం ఇక వీళ్లు మారరు. కాంగ్రెస్ పార్టీ బాగుపడదు.. అంటూ నిట్టూరుస్తూ నిష్క్రమించారు. వచ్చిన నేతల్లోనూ ఫ్లెక్సీ పంచాయితీ రచ్చకెక్కి రాస్తారోకోల వరకూ వెళ్లింది. మొత్తంగా కాంగ్రెస్ కార్యక్రమం పెద్ద ప్రహసనంగా సాగింది.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్28(నమస్తే తెలంగాణ) : నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి నిరుద్యోగుల నుంచి స్పందన కరువైంది. చివరికి ఆ పార్టీ శ్రేణులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన ర్యాలీ ఆ పార్టీ నేతల ఆధిపత్య పోరుకు మరోసారి వేదికైంది. జిల్లా కాంగ్రెస్ ముఖ్యులు ఆది నుంచే ఈ కార్యక్రమం పట్ల ఆంటిముట్టనట్లుగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలానే రేవంత్రెడ్డి తన మందీ మార్భలంతో నల్లగొండకు చేరుకున్నారు. ముందుగా ఎంజీ యూనివర్సిటీ వద్ద నిరుద్యోగులు, విద్యార్థ్ధులతో భేటీ కావాల్సి ఉండగా అక్కడ పట్టుమని పది మందీ కూడా లేరు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకే ఎంజీ యూనివర్సిటీకి చేరుకుని నిరుద్యోగులతో భేటీ కావాల్సి ఉంది. ఆ సమయానికి కూడా అక్కడ లేకపోవడంతో స్థానిక నేతలు ఇప్పుడే రావద్దని చెప్పడంతో నార్కట్పల్లి వివేరా హోటల్లో ఆగిపోయారు.
నిరుద్యోగులు, చివరకు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి సైతం కనీసం స్పందన లేకపోవడంతో చివరకు ఆరు గంటలకు రేవంత్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్కడ మాట్లాడేందుకు ఎవ్వరూ లేకపోవడంతో కేవలం మూడు నిమిషాలే అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి వెనుదిరిగారు. ఈ సమయంలో జిల్లాకు చెందిన ముఖ్య నేతలెవ్వరూ రేవంత్రెడ్డి వెంట లేరు. ఇక అక్కడి నుంచి నల్లగొండ పట్టణంలో సభకు బయల్దేరారు. మర్రిగూడ చౌరస్తా నుంచి పాదయాత్రగా క్లాక్టవర్కు బయల్దేరగా తన అనుచరులే వెంట నడిచారు. నల్లగొండలో రేవంత్రెడ్డి ఒక్కడే మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా సభాస్థలం క్లాక్టవర్ సెంటర్కు చేరుకున్నారు.
ఏమీ పట్టనట్లుగా ముఖ్య నేతలు
అంతకుముందే నల్లగొండకు చేరుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా రేవంత్రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధ పడలేదు. రేవంత్రెడ్డి ర్యాలీగా వెళ్లిన కొద్దీ సేపటికి తన ప్రత్యేక వాహనంపై వెనుకాల మరో ర్యాలీగా క్లాక్టవర్కు చేరుకున్నారు. రేవంత్రెడ్డి పాదయాత్ర మొదలయ్యే సమయానికే జిల్లా కేంద్రానికి చేరుకున్న స్థానిక ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి కూడా తమకు పట్టనట్లే ఉన్నారు. రేవంత్రెడ్డి క్లాక్టవర్ సెంటర్లో వేదిక మీదకు చేరుకునే వరకు కూడా ప్రకాశంబజార్లోని తన క్యాంపు కార్యాలయానికే ఉత్తమ్, జానారెడ్డి పరిమితం అయ్యారు.
రేవంత్రెడ్డి వేదికపైకి చేరుకున్న చాలా సేపటికి ఉత్తమ్, జానారెడ్డి వచ్చారు. ఇక కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండలో తన పట్టు ఎక్కడ చేజారుతోందనన్న ఆందోళనతో తన అనుచరులతో హంగామా చేస్తూ వేదిక మీదకు చేరుకున్నారు. వేదిక మీద మాత్రం తామంతా ఒక్కటే అన్నట్లుగా పోజులు ఇస్తుండడంతో కింద ఉన్న కార్యకర్తల్లో మాత్రం నవ్వులు పూశాయి. కడుపుల కత్తులు పెట్టుకుని కౌగలించుకోవడం ఇదేనేమోనన్న వ్యాఖ్యలు సైతం వినిపించాయి. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, అద్దంకి దయాకర్, చెరుకు సుధాకర్ వంటి నేతలంతా దీనికి దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ కోమటిరెడ్డి ఆది నుంచి అద్దంకి దయాకర్, చెరుకు సుధాకర్ లాంటి నేతలను పిలవద్దని ఒత్తిడి తెచ్చినట్లు చర్చ జరిగింది. ఈ ప్రకారంగానే వీరూ సభలో కనిపించకపోవడం గమనార్హం.
ఫ్లెక్సీల చించివేత రగడ
మరోవైపు రేవంత్రెడ్డి ర్యాలీ సాగుతుండగానే వివిధ నేతలకు చెందిన ఫ్లెక్సీల చించివేత రగడ కొనసాగింది. ఇతర ప్రాంతాలకు చెందిన నేతల ఫ్లెక్సీలను మాత్రమే చించివేస్తుండడంతో అవి కోమటిరెడ్డి వర్గీయులు చేసిన పనేని కొందరు ఆందోళనకు దిగారు. సభ జరగాల్సిన క్లాక్టవర్ సెంటర్లో రాస్తారోకో కూడా నిర్వహించి కొద్దీసేపు హంగామా చేశారు. నిరుద్యోగుల పేరుతో చేపట్టిన నిరసన ర్యాలీలో నిరుద్యోగులు లేకపోవడంతో రాజకీయ నిరుద్యోగుల ర్యాలీగా చర్చసాగింది.
కనిపించని నిరుద్యోగులు
ఇక వేదికపైకి కూడా అందర్నీ ఆహ్వానించడంలో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఎవ్వరినీ పిలిస్తే ఎవ్వరూ భగ్గుమంటారోనన్న ఆందోళన కనిపించింది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలకమైన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జానారెడ్డి లాంటి నేతలు వచ్చినా వీరంతా జన సమీకరణను పట్టించుకోలేదని తెలిసింది. అసలు జిల్లాలో రేవంత్రెడ్డి కార్యక్రమం అవసరమేంటన్న ధోరణినే చివరి వరకు వ్యక్తపరిచారు.అందుకే ఇలాంటి నేతలు వేదికపైన ఉన్నా… ఆ స్థాయిలో సభలో పార్టీ శ్రేణులు కనిపించలేదు. నిరుద్యోగులైతే మచ్చుకైనా కనిపించలేదు. ఇక నేతల ప్రసంగాల్లో సైతం ఎవ్వరి డబ్బా వాళ్లే కొట్టుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి సభకు సంబంధం లేకుండా తన సొంత ఎజెండాతోనే, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం గురించే ఎక్కువ ప్రస్తావిస్తూ కాలయాపన చేశారని ఆ పార్టీ వర్గాలే విమర్శలు వ్యక్తం చేశాయి. ఎక్కువ సమ యం తీసుకుని రేవంత్రెడ్డి మాట్లాడే సమయానికి జనం లేకుండా చేయడంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సక్సెస్ అయ్యారన్న చర్చ సభలో వినిపించింది.