చందమామపై చంద్రయాన్-3ని ఇస్రో విజయవంతంగా దింపడంపై బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంతోషం వెల్లివిరిసిరింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయ్యే అపూర్వ దృశ్యాలను అందరూ టీవీల్లో ఉత్కంఠగా తిలకించారు. మిషన్ చంద్రయాన్ 3 సక్సెస్ అవడంతో ఈలలు, కేరింతలతో ఆనందం పంచుకున్నారు. సామాజిక మాధ్యమల్లో, వాట్సాప్ స్టేటస్లోనూ సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేశారు.
రామగిరి, ఆగస్టు 23 : దశాబ్దనర్న కాలంగా జాబిలిపై అడుగమోపాలనే భారత ఆకాంక్ష నెరవేరింది. జూలై 14న ఇస్రో నింగిలోకి పంపిన ‘చంద్రయాన్-3’ ఆది నుంచి జైత్రయాత్ర కొనసాగిస్తూ బుధవారం సాయంత్రం 6:04గంటలకు ల్యాండింగ్ కావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. 45రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదింపుతూ విజయాన్ని సొంతం చేసుకున్న ఇస్రో సైంటిస్టులను యావత్ భారతావని ఓవైపు కీర్తిస్తూ జాబిలిపై అడుగుపెట్టిన నాల్గో దేశంగా ఇండియా రికార్డు సృష్టించడంతో సంబరాలు చేసుకుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు చంద్రమమాపై అడుగుడినా దక్షిణ ధ్రువం వైపు తొలి సారిగా కాలుమోపిన మన చంద్రయాన్ -3 చరిత్రను సృష్టించింది. జాబిలి ల్యాండింగ్ను టీవీల్లో ప్రసారం చేయడంతో అందరూ టీవీలు, మొబైల్లో వీక్షించారు. చంద్రయాన్ సక్సెస్పై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బాణసంచాలు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థులు టీవీల్లో చంద్రయాన్ను వీక్షించారు.
ప్రపంచ చరిత్రలో లిఖించదగిన రోజు
భారత దేశ ఔనత్యం చాటేలా సాగిన చంద్రయాన్-3 విజయవంతం ప్రపంచ చరిత్రలో లిఖించదగిన రోజు. అంతేగాక మన ఇస్రో సైంటిస్టులు చేసిన కృషితో ప్రపంచంలో నాల్గో దేశంగా చంద్రుడిపై కాలుమోపిన ఇండియా మరో చరిత్ర సృష్టించిచడం గర్వంగా ఉంది. దీంతో ప్రపంచ దేశాలు అన్ని మన దేశంపై మన గొప్పతం ఆకాంక్షిస్తూ అభినందనలు తెల్పడం చాల సంతోషంగా ఉంది. దక్షిణ ద్రువంపై మన భారత్ తొలి పర్యాయం దిగడం చారిత్మ్రక ఘట్టం చరిత్రలో కీర్తించదగ్గిన అంశం.
– వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి, నల్లగొండ
చంద్రయాన్-3 విజయంలో పీఈఎల్ ఉద్యోగులు కీలకపాత్ర
ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయంలో పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఈస్రోలో పని చేసేందుకు కావాల్సిన ఉద్యోగుల కాంట్రాక్టు పెద్దకందుకూరు పీఈఎల్కే కేటాయించగా 400 మందికి ఉద్యోగులు ఎంపిక చేయగా ఇస్రోలో పలు హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా చంద్రయాన్-3లో వినియోగించే సాలీడ్ ప్రొపైలెంట్ బూస్టర్ తమ ఉద్యోగులే తయారు చేశారని పీఈఎల్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్ దుర్గాప్రసాద్ తెలిపారు. దీంతో పాటు 6 పీఎస్ఎల్వీ బూస్టర్లను తయారు చేయాలని తమకు ఇస్రో కాంట్రాక్ట్ ఇచ్చిందని మోటకొండూర్ మండలంలోని కాటేపల్లిలో గల పీఈఎల్లో 3బూస్టర్లను తయారు చేశామని, మరో 3బూస్టర్ల తయారీ పనులు సాగుతున్నాయన్నారు. ఈ బూస్టర్లు మరో ప్రయోగంలో వినియోగించనున్నట్లు వెల్లడించారు.