సూర్యాపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ వినూత్నంగా చేపట్టిన సడెన్ సర్ప్రైజ్ విజిట్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. ప్రత్యేకాధికారి సహా మండలానికో ప్రత్యేక బృందాన్ని నియమించగా ఈ నెల 14న తొలి విడుతగా 23 మండలాల్లో అధికారులు హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, తాసీల్దార్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు తదితర పలుచోట్ల చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో 1,426 సమస్యలను గుర్తించారు. 24వ తేదీ నాటికి వంద శాతం సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యం పెట్టుకోగా, ఆరు రోజుల్లోనే 80 శాతం పూర్తికావడం గమనార్హం. కాగా, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా పారదర్శక పాలన కొనసాగేందుకు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అందజేయాల్సిన సేవలను సకాలంలో, సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజావాణికి జనం పెద్దఎత్తున వచ్చి వినతులు ఇస్తుండడం, వాటిని సంబంధిత మండలాల అధికారులకు పంపించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే వీటిలో కొన్ని మాత్రమే పరిష్కారమవుతున్నాయి.
వాస్తవానికి ప్రజలు చేసే వినతుల్లో కొన్ని లీగల్గానో లేక ఇతర పంచాయతీల కారణంగా పరిష్కారానికి నోచవు. కొన్ని మాత్రం వెంటనే పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా ఉద్యోగుల్లో నిర్లిప్తత కారణంగా పెండింగ్ ఉంటున్నాయి. అంతేకాకుండా వచ్చిన ఫిర్యాదులే మళ్లీ వస్తున్నాయి. వీటిని చక్కదిద్దేందుకు కలెక్టర్ సడెన్ సర్ప్రైజ్ విజిట్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో ప్రతి మండలానికి నియమించిన స్పెషల్ అధికారితోపాటు ఇతర ఉద్యోగులతో బృందాలను నియమించారు. వీరితోపాటు తనిఖీలు సక్రమంగా, పారదర్శకంగా కొనసాగేందుకు ఇద్దరు అదనపు కలెక్టర్లు కూడా ఆకస్మిక తనిఖీల్లో పాల్గొంటున్నారు.
సడన్ సర్ప్రైజ్ విజిట్తో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. కలెక్టర్ ఆదేశాలతో ఈ విజిట్కు కేవలం ఐదు నిమిషాల ముందే సమాచారం ఇస్తుండగా ఉద్యోగులు అయోమయానికి గురికావడం, ఇండ్ల వద్దే ఉన్న ఉద్యోగులు, సిబ్బంది హుటాహుటిన విధులకు వస్తున్నారు. ఈ నెల 14న జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సడెన్ సర్ప్రైజ్ విజిట్లో పలు అంగన్వాడీ సెంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, విద్యార్థులు, ఇతర లబ్ధిదారులకు గుడ్లు ఇవ్వకపోవడం, హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం, పాఠశాలల్లో టీచర్ల డుమ్మాలు, గ్రామపంచాయతీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం లాంటి సమస్యలను గుర్తించారు.
జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1,426 సమస్యలను గుర్తించగా, ఇప్పటి వరకు 80 శాతం అంటే 1,201 సమస్యలు పరిష్కారమయ్యాయి. సమస్యలను ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా విభజించగా ఏ, బీ కేటగిరీల్లో 954 సమస్యలు కేవలం రెండు రోజుల్లోనే పరిష్కారం కాగా, సీ కేటగిరీలో 290 పరిష్కారం కాగా, కొన్ని పరిష్కారం దశలో ఉన్నాయి. డీ కేటగిరీలో 182 మందిలో మార్పు కనిపించకపోవడంతో సంబంధిత జిల్లా అధికారులు వారికి మెమోలు జారీ చేస్తున్నారు.
సడెన్ సర్ప్రైజ్ కార్యక్రమాన్ని నెలలో ఎన్ని సాైర్లెనా చేపడతాం. అధికారులు, ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి. ఎవరైనా తప్పుడు మార్గాల్లో ఉంటే వెంటనే మారాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. ప్రజలకు సత్వర సేవలను సక్రమంగా అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఈ నెల 14న చేపట్టిన ఆకస్మిక తనిఖీలో ఉద్యోగులు, సిబ్బంది పనితీరు తెలిసింది. ఈసారి ఫర్టిలైజర్ షాపులు, రైతు భరోసా కేంద్రాలు, రైతు వేదికలు, జూనియర్ కళాశాలలు, వ్యవసాయ మార్కెట్లతోపాటు ఇతర సంస్థలను విజిట్ చేస్తాం.
-కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, సూర్యాపేట