సూర్యాపేట, జనవరి 5 : అభయ హస్తం అమలులో భాగంగా ప్రజాపాలన సభల్లో స్వీకరిస్తున్న దరఖాస్తులను ఈ నెల 12లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రియాంక, వెంకట్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన సభల్లో ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులను ఆన్లైన్ చేసే క్రమంలో దరఖాస్తుదారుల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు.
తప్పులకు ఆస్కారం లేకుండా ఆపరేటర్లు ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఎంట్రీ చేయాలన్నారు. ఎంపీడీఓలు, తాసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులను జాగ్రత్తగా భద్రపర్చాలన్నారు. డేటా ఎంట్రీ కోసం జిల్లా వ్యాప్తంగా 489 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి దరఖాస్తు కుడి వైపున డేటా ఎంట్రీ ఆపరేటర్ సంతకం చేయాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈడీఎం గఫార్తోపాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.