భువనగిరి కలెక్టరేట్, మే 20 : ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే సెక్టార్ ఆఫీసర్లకు, టీములకు సూచించారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా సెక్టార్ ఆఫీసర్లకు, ఎఫ్ఎస్టీ, స్పెషల్ వీడియో టీమ్స్, ఎంసీసీ టీములకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం మీటింగ్ హాలులో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 27న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. భువనగిరి డివిజన్లో 22, చౌటుప్పల్ డివిజన్లో 15 కలిపి.. మొత్తం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. భువనగిరి డివిజన్లో 7,784 మంది మహిళలు, 12,421 మంది పురుషులు, చౌటుప్పల్ డివిజన్లో 5,458 మంది మహిళలు, 8,417 మంది పురుషులు కలిపి మొత్తం 34,080 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో 12మంది సెక్టార్ ఆఫీసర్లు, 6 ఫ్లయింగ్ స్వాడ్ టీములు, 17 స్పెషల్ వీడియో టీములు, 17 ఎంసీసీ టీములు పర్యవేక్షిస్తాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా సెక్టార్ ఆఫీసర్లు చూడాలని, బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ఓటర్లకు పోల్ స్లిప్స్ పంపిణీ పూర్తయ్యేలా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితోపాటు పోలింగ్ మెటీరియల్ సకాలంలో వెళ్లేలా, తిరిగి పోలింగ్ కేంద్రాల నుంచి పోల్ అయిన మెటీరియల్ రిసెప్షన్ సెంటర్కు చేరుకునేలా పర్యవేక్షించాలని సూచించారు.
ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ విధులు నిర్వహిస్తారని, పోలింగ్ రోజున పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని అన్నారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా, ఉల్లంఘనలు జరుగకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం వివరాలు తెలుపాలని, పోలింగ్ సమయం ముగిసే (సాయంత్రం 4గంటల) వరకు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన వారందరూ ఓటు వినియోగించుకునేలా చూడాలని అన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలపై, బహుమతులు, కానుకలు, నగదు, మద్యం పంపిణీపై నిఘా టీమ్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, ప్రజాప్రాతినిథ్య చట్టం 1951లోని అన్ని నిబంధనలను పాటించాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హకును వినియోగించుకోవాలని సూచించారు. 52మంది పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో జంబో బ్యాలెట్ బాక్స్ వినియోగించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి అమరేందర్ పాల్గొన్నారు. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ నిర్వహించారు.