నల్లగొండ, మే 20 : ఎమ్మెల్సీ పోలింగ్, కౌంటింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలని వరంగల్ – ఖమ్మం – నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలింగ్, ఓట్ల లెకింపు ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల ప్రణాళిక, అభ్యర్థుల వ్యయ నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అంశాలపై సమీక్షించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 22న నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలింగ్ సిబ్బందికి కౌంటింగ్పై శిక్షణ నిర్వహించాలని, అవసరమైతే 12 జిల్లాల్లో సైతం శిక్షణ నిర్వహించేలా చూడాలని సూచించారు. 24న పీఓ, ఏపీఓ, సూక్ష్మ పరిశీలకులకు 2వ విడుత శిక్షణ నిర్వహించాలని, రెండో విడుత ర్యాండమైజేషన్ సైతం అదే రోజు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఓట్ల లెకింపు జూన్ 5న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, లెకింపునకు హాజరయ్యే సిబ్బందికి శిక్షణ నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రథమ చికిత్స సౌకర్యాలతోపాటు దివ్యాంగ ఓటర్లకు వాహనాలు ఏర్పాటు చేయాలని, వీల్చైర్లు పెట్టాలని సూచించారు.
పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఈ నెల 20 నుంచి 25 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులు, పోలీసులు, సూక్ష్మ పరిశీలకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటింగ్పై ఓటర్లకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, నల్లగొండ ఆర్డీఓ రవి, పాల్గొన్నారు.