యాదాద్రి భువనగిరి, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు చేరనున్నాయి. భువనగిరి, భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు గ్రేటర్లో విలీనం కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో అభివృద్ధికి నిధులు రావడంతోపాటు ప్రజలపై పన్నుల భారం కూడా పెరుగనున్నది. భూముల రేట్లు మరింత పెరగనున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో భువనగిరి, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. హెచ్ఎండీఏ ప్రాతిపదికన గ్రేటర్ సిటీ కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కుదిరితే ఒక్కటే కార్పొరేషన్, లేకుంటే నాలుగు కార్పొరేషన్లుగా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఉన్న గ్రేటర్ హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ఉన్న ఏడు చిన్న కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు ఇందులో చేర్చాలని సూచించారు. దాంతో జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు గ్రేటర్లో విలీనం అయ్యే అవకాశం ఉంది.
భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి సెమీఅర్బన్ ఏరియాలుగా ఉన్నాయి. ఇవి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. కొంత కాలం క్రితమే పోచంపల్లి పురపాలక సంఘంగా ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలు పట్టణం, గ్రామాలు కలిపి ఉన్నాయి. దాంతో ట్యాక్స్ స్లాబ్ తక్కువగా ఉంటుంది. పన్నుల చెల్లింపు పెద్దగా ఉండదు. కానీ ఇప్పుడు గ్రేటర్లో కలిపితే పన్నుల మోత మోగుతుంది. ఇంటి పన్ను, నల్లా పన్ను ఇతర ట్యాక్స్లు అన్నింటిపై ఈ ప్రభావం ఉంటుంది.
గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేస్తే మున్సిపాలిటీలకు నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ మూడు మున్సిపాలిటీలకు హెచ్ఎండీఏ ద్వారా భారీగా నిధులు సమకూరుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్కు భారీ బడ్జెట్ ఉంటుంది. శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పన కోసం పెద్ద మొత్తంగా నిధులు వెచ్చించే ఆస్కారం ఉంది. విలీనం ఒకవిధంగా అభివృద్ధి చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భూమలు రేట్లు భారీగా పెరిగాయి. ఎవరూ ఊహించనంత స్థాయికి చేరాయి. దాంతో రైతులు, భూ యజమానులు సంతోషంగా ఉన్నారు. భువనగిరి పట్టణంలో సగటున ఎకరం రూ.4కోట్ల వరకు పలుకుతున్నది. జాతీయ రహదారి ఉండటంతో చౌటుప్పల్లోనూ మంచి రేట్లు ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కలిపితే భూములు ధరలు మరింత పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ ఇంకింత పుంజుకునే అవకాశం ఉంది. భౌగోళికంగానూ డెవలప్ అవుతుంది.
గ్రేటర్ సిటీలోకి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మాత్రం విలీనానికి సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే మున్సిపాలిటీలు మాత్రమే చేస్తే.. గ్రామాల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఉదాహరణకు.. హైదరాబాద్ నుంచి భువనగిరి మధ్య బీబీనగర్ ఉంటుంది. భువనగిరిని గ్రేటర్లో కలిపితే బీబీనగర్తోపాటు మధ్యలో వచ్చే గ్రామాలను ఏం చేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్లోనూ ఇదే సందిగ్ధత ఉంది.