సూర్యాపేటలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభతో నియోజకవర్గ జనం అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నట్లు స్పష్టమైంది. తొమ్మిదిన్నరేండ్లలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి
గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి సభకు లక్ష మందికిపైనే హాజరయ్యారు. మంత్రి
జగదీశ్రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తే ఆయనకు ఉన్నత స్థానం ఖాయమని సభలో సీఎం కేసీఆర్
స్పష్టం చేయడం, ఐటీహబ్, పారిశ్రామిక వాడ, డ్రైపోర్ట్, టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని అనడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది.
బీఆర్ఎస్తో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చర్చలు మొదలయ్యాయి. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బీఆర్ఎస్కు భారీ మెజారిటీ వస్తుందని బెట్టింగులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇక వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బుధవారం 38వ వార్డు, 15వ వార్డు కౌన్సిలర్లు గండూరి రాధికారమేశ్, ఎలిమినేటి అభినయ్ తిరిగి సొంత గూటికి చేరారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 22 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పదేండ్లుగా కొనసాగుతున్న నిరంతర అభివృద్ధి, సంక్షేమాన్ని ఆస్వాదిస్తున్న అన్ని రంగాల ప్రజల ఆశీర్వాదమే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అరవయేండ్ల పాలనను ఎండగట్టి అభివృద్ధికి చిరునామాగా మారిన గులాబీ జెండాపై ప్రజలో గుండెల్లో పెంచుకున్న ప్రేమ, ఆదరణే తమ బలం, బలగమని తెలిపారు. సీఎం కేసీఆర్ సూర్యాపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆటో డ్రైవర్ల పట్ల వరాలు కురిపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తమ సంపూర్ణ మద్దతును బీఆర్ఎస్ పార్టీకి ప్రకటించారు.
అంతకుముందు వేలాదిగా ఆటో డ్రైవర్లు, కార్మికులు ప్రధాన వీదుల్లో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక కర్నల్ సంతోశ్బాబు చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి ప్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకుని మంత్రి జగదీశ్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లు పాలిచి ఆగం చేసింది కాక.. పదేండ్లు గడిచింది మరిచిపోతారులే అనుకుని ఇప్పుడేదో కొత్తగా చేస్తామంటూ నెరవేర్చలేని హామీలతో తిరుగుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు జోకర్లుగానే భావిస్తున్నట్లు తెలిపారు. వాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతే మళ్లీ పదేండ్లు అభివృద్ధిలో వెనుకపడతామనే విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు.
సూర్యాపేట అభివృద్ధి 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు వేసిన ఓటుతోనే మారిందన్నారు. అన్ని విధాలుగా దోచుకున్న కాంగ్రెస్, బీజేపీ కావాలా? నిరంతరం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పాలన కావాలా ఆలోచించి ఓటేయాలని మంత్రి కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, నాయకులు నంద్యాల దయాకర్రెడ్డి, డాక్టర్ రామ్మూర్తియాదవ్, మొరిశెట్టి శ్రీను, గండూరి ప్రకాశ్, అనుములపురి రవిబాబు గండూరి రమేశ్ పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన్, నవంబర్ 22 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ భారీ సక్సెస్తో సూర్యాపేటలో పింక్ వేక్ వేగం పుంచుకున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్రెడ్డి గెలుపు ఖాయం అవడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల నుంచి వలసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు క్షణికావేశంలో పార్టీని వీడిన వారంతా సొంత గూటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే 38వ వార్డు కౌన్సిలర్ గండూరి రాధికారమేశ్, 15వ వార్డు కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ తిరిగి పార్టీలో చేరగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనుములపురి పరంధాములు కుమారుడు డాక్టర్ రవిబాబు కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు మరో సీనియర్ నాయకుడు పోలగోని కృష్ణ, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు.
అలాగే పట్టణానికి చెందిన బీజేపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి గార్లపాటి మమతారెడ్డి, పాలకుర్తి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడి సోదరుడు కోటగిరి జగదీశ్ ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. ఆత్మకూర్.ఎస్ మండలం కందగట్ల, సూర్యాపేట రూరల్ మండలం టేకుమట్లకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరగా వారందరికీ మంత్రి జగదీశ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్రెడ్డి సూర్యాపేట అభివృద్ధికి చేసింది శూన్యమని డాక్టర్ అనుములపురి రవిబాబు అన్నారు. మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సూర్యాపేటను నందనవనం చేసింది మంత్రి జగదీశ్రెడ్డి అని కొనియాడారు. సూర్యాపేటలో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ సిండికేట్, మాఫీయాదే రాజ్యమన్నారు. గాంధీ, ఉస్మానియా తర్వాత స్థానం సూర్యాపేట మెడికల్ కళాశాలదే అని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీతో ఒరిగిందేమి లేదన్న ఆయన నిత్యం అభివృద్ధిని కాంక్షించే మంత్రి జగదీశ్రెడ్డికి ప్రజలంతా అండగా నిలిచి సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట పట్టణానికి చెందిన మరికొందరు కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మంతనాలు పూర్తి అయ్యాయి. సీఎం సభ సక్సెస్ కావడం, ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ప్రజల నుంచి ఆదరణ లభించకపోవడం చూసిన నేతలు మరోసారి జగదీశ్రెడ్డి గెలువడం ఖాయంగా భావించి బీఆర్ఎస్ వనంలోకి వచ్చేందుకు క్యూ కడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పోలింగ్ తేదీ నాటికి సూర్యాపేట నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు ఖాళీ కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.