యాదాద్రి, అగస్టు 3 : దేశంలో నిఖార్సయిన హిందువు సీఎం కేసీఆర్ అని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ. 1,200 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. హిందువులమని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధిలో ఒక్క రూపాయైనా ఖర్చు చేసిందా అని ప్రశ్నించారు. యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, ఆలేరు నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మనిషి సభకు హాజరుకాలేదన్నారు. సీఎం కేసీఆర్పై మాట్లాడే నైతిక అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి లేదన్నారు. టీఆర్ఎస్కు ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని మాట్లాడిన బండి సంజయ్, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలో వస్తే యాదాద్రిలో గుండు కొట్టించుకుని రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు.
ఆలేరులో బీజేపీకి తావులేదని నిన్న జరిగిన సంగ్రామ సభ చూస్తే తెలిసిపోతుందన్నారు. సూర్యాపేట, భువనగిరి, బోధన్ ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలించినా సభ ప్రాంగణం నిండలేదన్నారు. కరీంనగర్లో వేములవాడ ఆలయానికి ఒక్క రూపాయైనా కేంద్రం నుంచి మంజూరు చేయించారా? అంటూ నిలదీశారు. స్వార్థ రాజకీయాల కోసం మతాలను వాడుకుంటూ సామాన్య ప్రజలను రెచ్చగొట్టడం దుర్మార్గం మని అన్నారు. సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామ రూపురేఖలు మారేలా అభివృద్ధి జరుగుతుంటే కళ్లకు కనిపించడం లేదా అని అన్నారు. గ్రామంలో నూతన భవనాలకు లే అవుట్ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వాసాలమర్రిలో 99 శాతం దళితబంధు యూనిట్లను పంపిణీ చేశామని వివరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటంరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మదర్ డెయిరీ డైరెక్టర్ కల్లెపల్లి శ్రీశైలం, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంచంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మారెడ్డి కొండల్రెడ్డి, కౌన్సిలర్ సురేందర్, రైతు బంధు సమితి డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు కసావు శ్రీనివాస్, పెలిమెల్లి శ్రీధర్గౌడ్ , పాపట్ల నరహరి, చిత్తర్ల బాలయ్య, అంకం నర్సింహ పాల్గొన్నారు.
‘భిక్షమయ్య భూ కబ్జాకోరు ’
గతంలో ఎమ్మెల్యేగా ఉండి 300 ఎకరాలు కబ్జా చేసిన భూ కబ్జాకోరు భిక్షమయ్య ఆలేరు అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గు చేటు అని మహేందర్రెడ్డి అన్నారు. 8 కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని తెలిపారు. ఎనిమిదేండ్లలో రూ. వేల కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా డబుల్ బీటీ రోడ్లు వేసి చూపామని చెప్పారు. రూ. 45 కోట్లతో ఆలేరు నుంచి గుండాల వరకు, రూ.100 కోట్లతో రాయగిరి నుంచి ఆలేరు వరకు, రూ.26 కోట్లతో బొమ్మలరామారం నుంచి కొండమడుగు మెట్టు వరకు, రూ.8.50 కోట్లతో రాయగిరి నుంచి ఖప్రాయిపల్లి వరకు డబుల్ బీటీ రోడ్డు నిర్మాణం జరిగాయన్నారు. రూ.16 కోట్లతో కొలనుపాక నుంచి నమిలే వరకు రూ.15 కోట్లతో ఆలేరు నుంచి రఘునాథపురం, రూ.16 కోట్లతో కొలనుపాక నుంచి నమిలే వరకు, మల్లాపురంలో రూ.32 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. భిక్షమయ్య గౌడ్ సొంత గ్రామం పారుపల్లికి వెళ్లేందుకు ఆలేరు పెద్దవాగుపై రూ.20 కోట్లతో చెక్ డ్యాంతో కూడిన బ్రిడ్జి నిర్మిస్తున్నామని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. తండాలకు కలుపుతూ 28 బీసీ, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. ఆలేరు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. గుండాల మండలం సస్యశ్యామలం చేసేందుకు నవాబ్పేట రిజర్వాయర్ ప్రధాన కాల్వలతో పాటు మరో ఆరు ఉపకాల్వలు, మొత్తం 16 కిలోమీటర్ల కాల్వ నిర్మాణం, ఆధునీకరణ చేపట్టి 31 వేల ఎకరాలకు సాగునీరందించామని అన్నారు. కేసీఆర్ జలసంకల్పంతో ఆలేరు, గుండాల మండలాలకు గోదావరి జలాలను అందించేందుకు ఆశ్వరావుపల్లి కుడి ప్రధాన కాల్వ పనులు చకచక సాగుతున్నాయన్నారు.