స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కొత్త పథకాలు తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేస్తున్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందినవారు స్వయం ఉపాధితో రాణిస్తూ గ్రామంలో ఇతర కుటుంబాలకు ఆదర్శంగా జీవిస్తున్నారు.
– బొమ్మలరామారం, మే 28
బొమ్మలరామారం మండలంలోని మునీరాబాద్ గ్రామంలో 16 దళిత కుటుంబాలకు ప్రభుత్వం దళితబంధు పథకం మంజూరు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున రూ.1.60కోట్లు అందజేసింది. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో లబ్ధిదారులు వారి అభిరుచి మేరకు వ్యాపారాలను ఎంచుకున్నారు. కొందరు ట్రాక్టర్లు, వ్యాన్లు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు. నాడు కూలీలుగా ఉన్న వారు నేడు వ్యాపారులుగా, వాహన యజమానులుగా మారి వివిధ రంగాల్లో రాణిస్తూ ఆదాయాన్ని గడిస్తూ ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
నేను డిగ్రీ వరకు చదువుకున్నా. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మధ్యలో మానేశా. ప్రైవేట్ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేశాను. గ్రామంలో నాకు కొంత సాగు భూమి ఉన్నది. దళితబంధు పథకం కింద పది లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆ డబ్బుతో ట్రాక్టర్ కొనుగోలు చేశా. నా పొలం దున్నడంతోపాటు ఇతరుల వ్యవసాయ పనులకు వెళ్తున్నాను. ఇప్పుడు ట్రాక్టర్ యజమానిగా ఊర్లో పనిచేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నా. దళితుల సమస్యలు తెలుసుకొని దళితబంధు అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– తొంట సత్యనారాయణ, దళితబంధు లబ్ధిదారుడు, మునీరాబాద్ గ్రామం
నెలకు రూ.50వేలు సంపాదిస్తున్నా
ఇంతకుముందు నేను గోదాములో హమాలీగా పనిచేసేది. వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడానికి ఇబ్బంది అయ్యేది. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా పెట్టుబడి లేక మిన్నకుండిపోయా. దళితబంధు పథకం కింద నాకు రూ.10లక్షలు మంజూరు కావడంతో టాటా ప్లస్ వ్యాన్ కొనుగోలు చేశాను. ఘట్కేసర్ నుంచి హైదరాబాద్కు సరుకులు రవాణా చేస్తున్నా. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50వేల వరకు మిగులుతున్నాయి. ఇంత డబ్బు సంపాదిస్తానని కలలో కూడా ఊహించలేదు. కూలీ నుంచి వ్యాన్ ఓనర్గా మారడానికి ఆర్థిక సహకారం అందించిన సీఎం కేసీఆర్ సల్లగుండాలి.
– జోగు నర్సింహ, దళితబంధు లబ్ధిదారుడు, మునీరాబాద్
ట్రాక్టర్కు ఓనర్నయ్యాను
నేను పక్క గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశాను. దళితబంధు పథకం డబ్బుతో ట్రాక్టర్ తీసుకొన్న. మా గ్రామంతోపాటు పక్క ఊర్లో పొలాలు దున్నుతున్నాను. ఇంతకుముందు వచ్చే జీతం కంటే ఇప్పుడు ఎక్కువగా సంపాదిస్తున్నా. డ్రైవర్గా పనిచేసిన చోట ఓనర్గా మారడం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధిస్తాను. దళితబంధు నిజంగా ఓ నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. కేసీఆర్ సార్ ప్రభుత్వానికి అండగా ఉంటా.
– బంగారు కాశీం, దళితబంధు లబ్ధిదారుడు, మునీరాబాద్ గ్రామం
నాడు లారీ డ్రైవర్.. నేడు ఓనర్ అయ్యాను
మాది నిరుపేద కుటుంబం. చదువు మధ్యలో మానేసి లారీ డ్రైవర్ అయ్యాను. నెలలో 15రోజులు మాత్రమే పని దొరికేది. సొంతంగా ఏదైనా వాహనం తీసుకొని నడుపుకొందామంటే బయట అప్పు పుట్టలేదు. బ్యాంక్వారిని సంప్రదిస్తే ష్యూరిటీ కావాలన్నారు. దళితబంధు పథకం గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పది లక్షలు మంజూరు చేసింది. ఆ డబ్బుతో టాటా ప్లస్ వ్యాన్ కొనుగోలు చేసి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తీర్చడానికి సహకారం అందించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా.
– శ్రీపతి రాజు, దళితబంధు లబ్ధిదారుడు, మునీరాబాద్