నార్కట్పల్లి, ఫిబ్రవరి 18 : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున శేష వాహనంపై స్వామి వారి సేవా కార్యక్రమాలను ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సూర్య నమస్కారాలు, దీక్షా హోమాలు, రుద్రహోమం, బలిహరణ, సందస్యం వేద స్వస్తి, సరస్వతీ పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహా నివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. ఆంజనేయ స్వామికి లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, ఇన్చార్జి ఈఓ నవీన్, డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం తెల్లవారుజామున స్వామి వారి అగ్ని గుండాలు, పర్వత వాహన సేవను ఘనంగా నిర్వహించనున్నారు. అగ్ని గుండంలో రైతులు పండించిన ఆముదాలు, కందులు, ఇతర ధాన్యాలు వేసి మొక్కు చెల్లించుకుంటారు. అర్థరాత్రే గుట్టపైకి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోగా కణకణలాడే నిప్పులపై నడుచుకుంటూ వెళ్లనున్నారు.