నల్లగొండ, జనవరి 8 : రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 7,850 మంది అర్హులు డీడీలు చెల్లించారని, వారందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని, లేకుంటే డీడీల డబ్బులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులు ధర్నా చేశారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో 62 వేల మందికి గొర్రెల యూనిట్లు ఇస్తామని తొలి విడుతలో 32 వేల మందికి ఇచ్చిందని, రెండో విడుతలో 30 వేల మందికి ఇవ్వాల్సి ఉండగా.. వారిలో ఇప్పటి వరకు సబ్సిడీ పోను ఒక్కొక్కరి దగ్గర రూ.43,750 డీడీల రూపంలో మొత్తంగా రూ.34.34 కోట్లు సేకరించి కలెక్టర్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. వారికి యూనిట్లు ఇచ్చే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయినందున డీడీలు చెల్లించిన వారికి వెంటనే యూనిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే కట్టిన డీడీలు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే వినతిపత్రం ఇచ్చే సమయంలో కలెక్టర్తోపాటు కలెక్టరేట్ ఏఓలు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యాదాద్రిభువనగిరి జిల్లా యాదవసంఘం అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య, కార్యదర్శి చలకాని మల్లేశ్, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు ఎర్రన్న, నాగార్జునసాగర్ అధ్యక్షుడు కుంటిగొర్ల లింగయ్య, నకిరేకల్ అధ్యక్షుడు చింతల సందీప్, మునుగోడు అధ్యక్షుడు గుండెబోయిన వెంకటేశ్, ఆయా మండలాల అధ్యక్షులు పాక రమేశ్, కన్నెబోయిన అంజిబాబు, జానపాటి శంకర్, బుర్ర వెంకటయ్య, బండారి శంకర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వం రెండో విడుత గొర్రెల పంపిణీ కింద నాకు యూనిట్ ఇస్తానంటే వ్యక్తిగత వాటా కింద రూ.43,750 ఎస్బీఐలో డీడీ తీసి పశు సంవర్థక శాఖ అధికారులకు అందజేశాను. డీడీలు కట్టి ఇప్పటికే రెండు నెలలు అవుతున్నది. ఇన్ని రోజులు ఎన్నికలు అని ఆపిండ్రు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినందున నాకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయాలి. లేకుంటే డీడీ డబ్బులైనా ఇవ్వాలి.