నల్లగొండ సిటీ, డిసెంబర్ 23 : విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు తాసీల్దార్లు జాప్యం లేకుండా కుల, ఆదాయ ధ్రువ పత్రాలను జారీ చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇందుకుగాను అవసరమైతే ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలని డీఈఓ, ఆర్డీఓను ఆమె ఆదేశించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో పలు ప్రభుత్వ సంస్థలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల పంపిణీపై వచ్చిన దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎంపీడీఓ, తాసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధ్రువపత్రాల కారణంగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలుసుకుని కుల, ఆదాయ ధ్రువ పత్రాలను జారీ చేసేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీఈఓ బిక్షపతి ని ఆదేశించారు.

Nalgonda City : జాప్యం లేకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
అనంతరం ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను సైతం వెంటనే చెల్లించాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ను ఆదేశించారు. ఆ తర్వాత కలెక్టర్ భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి పనులు పూర్తికావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారికి చాక్లెట్లను పంపిణీ చేశారు.
అనంతరం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల వివరాలను, సిబ్బంది, డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్, ఓపి రిజిస్టర్ తో పాటు, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, పరికరాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా టీబీ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, డీఈఓ భిక్షపతి, తాసీల్దార్ పద్మ, ఎంపీడీఓ, కనగల్ సర్పంచ్ మురళి గౌడ్ ఉన్నారు.

Nalgonda City : జాప్యం లేకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి