నల్లగొండ ప్రతినిధి, మే 23 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నకిరేకల్, మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో జరుగనున్న సమావేశాల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొననున్నారు.
పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 11 గంటలకు నకిరేకల్లోని సువర్ణ గార్డెన్స్లో మీటింగ్కు హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ మండలం దామెరలోని బాలాజీ గార్డెన్స్లో సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటలకు దేవరకొండలోని సాయిశివ ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగియనుంది. ఈ నెల 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుండగా.. నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ప్రచారం బంద్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ నెల 25న సాయంత్రం 4గంటల వరకే ప్రచారానికి గడువు మిగిలి ఉంది. ఆ తర్వాత ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదు. దీంతో శుక్ర, శనివారాల్లో ప్రచారం మరింత ఉధృతంగా సాగనుంది.
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించుకునేందుకు ఉమ్మడి జిల్లాలోని పార్టీ యావత్తు రంగంలోకి దిగింది. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఆది నుంచీ బీఆర్ఎస్దే విజయం. ప్రస్తుత ఉప ఎన్నికల్లోనూ మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో పార్టీ శ్రేణులంతా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ మార్గదర్శనంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు పూర్తి చేశారు.
కేటీఆర్ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాలను చుట్టివస్తూ పట్టభద్రులు, పార్టీ కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేస్తున్నారు. మండలాల వారీగా బూత్ కమిటీలు సైతం ఏర్పాటు చేసి గ్రామాల వారీగా ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లుతున్న విధానాలను వివరిస్తుండడంతో మంచి స్పందన లభిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న వ్యవహారశైలిని, దుర్మార్గాలను, దందాలను ఎత్తిచూపడంతోపాటు కేసీఆర్ ప్రభుత్వ విజయాలను, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి వ్యక్తిత్వం గురించి చెప్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ప్రచారానికి పట్టభద్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ప్రచారం మరింత ఊపునిస్తుంది.