చండూరు/ మర్రిగూడ, ఫిబ్రవరి 9 : తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ బీఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాను వందల ఏండ్ల నుంచి పట్టిపీడించిన ఫ్లోరైడ్ మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టిన మహానుభావుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని పేర్కొన్నారు. చండూరు పట్టణం, మర్రిగూడ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తే 5 జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటితోపాటు కరెంటు కష్టాలు తప్పవన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు కేసీఆర్ తలొగ్గలేదని, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పలేదని తెలిపారు. కాంగ్రెస్ను నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే నమ్మించి గొంతు కోస్తున్నదని, అవగాహన రాహిత్యంతో కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సంతకాలు చేసిందని అన్నారు. నీళ్ల కోసం మళ్లీ పోరాటం చేయాల్సిన దుస్థితిని రేవంత్రెడ్డి ప్రభుత్వం తెచ్చిందని దుయ్యబట్టారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే మొదటగా నల్లగొండ జిల్లా ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదమున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనాన్ని ఎండగట్టి నీటి హక్కులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండలో ఈ నెల 13న భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారని తెలిపారు.
సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. బహిరంగ సభ ఇన్చార్జి నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ ఈ సభ పార్టీకి సంబంధించినది కాదని, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ, ఎంపీపీలు మెండు మోహన్రెడ్డి, పల్లె కల్యాణి, జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, పాశం సురేందర్రెడ్డి, నాయకులు దంటు జగదీశ్, మునగాల నారాయణరావు, వెంకటేశ్వర్రావు, అనిల్రావు, మధుసూదన్రావు, వెంకట్రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.