మిర్యాలగూడ, నవంబర్ 23 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిస్వార్థంగా సేవ చేస్తున్నా.. మరోమారు ఆశీర్వదించండి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని బంగారుగడ్డ, ఏడుకోట్లతండా, భాగ్యనగర్ కాలనీ, రామచంద్రగూడెం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రగతియాత్ర నిర్వహించారు. ఆయా కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో వచ్చి ఎమ్మెల్యే వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాతే మిర్యాలగూడ పట్టణం అభివృద్ధి చెందిందన్నారు. గత పదేండ్లుగా ముందెన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందన్నారు.
దాంతో పాటు అనేక మంది సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధిపొందారన్నారు. అభివృద్ధిని ఇక ముందు కూడా కొనసాగించడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేలా ప్రజలంతా ఆశీర్వదించాలని, అందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇప్పటి వరకు మిర్యాలగూడ పట్టణంలోని 29వ వార్డులో రూ.5.77కోట్లు, 30వ వార్డులో రూ.5.83కోట్లు, 31వ వార్డులో రూ.4.51కోట్లు, 12వ వార్డులో రూ.4.45కోట్లు, 13వ వార్డులో రూ.5.30 కోట్లతో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ భరోసా ఇస్తున్నారని, రాబోయే రోజుల్లో మరింత భరోసా కోసం బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు.
ప్రజలు ఇచ్చిన బలంతో మిర్యాలగూడ పట్టణంలో అద్భుతమైన ప్రగతి సాధించామని, మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు కుర్ర చైతన్య, మాలోతు రాణీశ్రీను, తిరుమలగిరి స్వర్ణలతావజ్రం, మాజీ కౌన్సిలర్ మాజిద్, నాయకులు మస్తాన్, బాలెసాహెబ్, దయాకర్రెడ్డి, శ్రీనివాస్, చాంద్పాషా, కూనల గోపాలకృష్ణ, హబీబ్, మౌజంఅలీ, నాగభూషణం, జాని, ఫహీమొద్దీన్, సాధినేని శ్రీను, దినేశ్, నూనె రవికుమార్, పసునూరి రమేశ్, అమీరొద్దీన్, కోల నాగేందర్, శ్రీనివాస్రెడ్డి, కొల్లోజు వెంకటేశ్వర్లు, నేరెళ్ల బక్కయ్య, శ్రీహరి పాల్గొన్నారు.