మోత్కూరు, నవంబర్ 22 : కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో మళ్లీ చిమ్మ చీకట్లేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మోత్కూరు మండలంలోని సదర్శాపురం, దాచారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు, కోలాటం ఆట పాటలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో తుంగతుర్తిని తాను పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. పదేండ్లలో ఏ ఒక్క రోజు తుంగతుర్తి నియోజక వర్గ ప్రజల బాగోగులు పట్టని కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వచ్చి ఎన్ని జిమ్మిక్కులను చేస్తున్నారో గమనించాలని, అటువంటి కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వరన్నారు. రైతు బంధును బంద్ చేస్తారని విమర్శించారు. బునాదిగానీ కాల్వ అసంపూర్తి పనులను పూర్తి చేసి బస్వాపురం ప్రాజెక్ట్కు అనుసంధానం చేసి మోత్కూరు, అడ్డగూడూరుకు కాళేశ్వరం జలాలను తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.
తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే తనను ఆశీర్వదించి మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నియోజక వర్గం రాజకీయ పరిశీలకుడు నేవూరి ధర్మేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, ఎంపీపీ రచ్చ కల్పనాలక్ష్మీనర్సింహారెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ అశోక్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్రనాథ్, తీపిరెడ్డి మేఘారెడ్డి, కొణతం యాకూబ్రెడ్డి, ఆయా గ్రామ శాఖల అధ్యక్షులు దొండ నర్సయ్య, కడమంచి వస్తాద్, సర్పంచులు అండెం రజితారాజిరెడ్డి పాల్గొన్నారు.