తిరుమలగిరి, మార్చి 31 : ఎండిన పంటలు పరిశీలించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాకు చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రైతులు, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాకు చేరుకుని అధినేతకు అభివాదం చేశారు. కేసీఆర్ బస్సులో నుంచి అభివాదం చేస్తూ తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో ఎండిన వరి పంటలను పరిశీలించడానికి బయల్దేరారు.
తిరుమలగిరి మున్సిపాలిటీలోని ఈదులపర్రెతండా వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు వద్ద కేసీఆర్ బస్సును, వెనుకాల కాన్వాయ్లోని కార్లను పోలీసులు తనిఖీ చేశారు. నాగారం : సాగు నీరందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నాగారం మండలంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు.