ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతతో నల్లగొండ పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే రూ.1,164 కోట్ల అభివృద్ధ్ది పనులకు శ్రీకారం చుట్టగా.. ఈ నెల 15న మరో 590 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ షెడ్యూల్ ఖరారైంది. పట్టణంలో 24 గంటలపాటు మంచినీరు అందించే కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే పూర్తయిన రూ.123.52 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
– నీలగిరి, మే 4
నీలగిరి, మే 4 : రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ఈనెల 15న నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. హైదరాబాద్ నుంచి బయల్దేరి నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. భోజనం అనంతరం పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే మరో రూ. 590.01 కోట్ల పనులకు శంకుస్థాపన చేసి ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఇటు మున్సిపల్ యంత్రాంగం, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తగిన ప్రణాళిక రూపొందిస్తున్నారు.
రూ.123.52 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం.
నల్లగొండ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కొన్ని పూర్తి కావడంతో ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించారు. అయితే నల్లగొండలో రూ. 1,164.03 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా అందులో రూ. 123.52 కోట్ల పనులు పూర్తి కావడంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 15న మరో 123.52 కోట్ల పనులను ప్రారంభించనున్నారు. ముందుగా చర్లపల్లి గ్రామ శివారులో రూ.3.02 కోట్లతో నిర్మించిన అర్బన్ పార్క్ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మర్రిగూడ జంక్షన్ నుంచి క్లాక్టవర్ వరకు రూ.118 కోట్లతో చేపట్టిన రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఫుట్పాత్, డ్రైనేజీ పనులను జాతికి అంకితం చేయనున్నారు. బస్టాండ్ సమీపంలో రూ. 25 లక్షలతో ఆధునీకరించిన సుభాశ్ చంద్రబోస్ విగ్రహం జంక్షన్ను, ప్రభుత్వ దవాఖాన ఆవరణలో రూ.1.16 కోట్లతో నిర్మించిన నిరాశ్రయుల భవనాన్ని, భాస్కర్ టాకీస్ వద్ద ఆధునీకరించిన అంబేద్కర్ విగ్రహం జంక్షన్, జూనియర్ కళాశాల పక్కన రూ.81లక్షలతో ఏర్పాటు చేసిన రైతు బజార్ను ప్రారంభించనున్నారు.
మరో రూ.590.01 కోట్ల అభివృద్ధ్ది పనులకు శ్రీకారం
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న రూ. 1,164 కోట్ల అభివృద్ధి పనులతో పాటు అదనంగా మరో రూ. 596.01 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 139.21 కోట్లతో పానగల్ ట్యాంక్ బండ్ సుందరీకరణ, కట్టపై సెంట్రల్ లైటింగ్, సైకిల్ ట్రాక్, గ్రీనరీ పనులు చేపట్టనున్నారు. రూ.30 కోట్లతో ఎన్జీ కళాశాల భవన నిర్మాణం, రూ.90.61 కోట్లతో కళాభారతి, రూ.12.25 కోట్లతో ఆర్అండ్బీ అతిథి గృహం, సర్కిల్ ఇంజినీర్ అధికారి కార్యాలయాలతో పాటు రూ.272.94 కోట్లతో అమృత్-2 పనులను శంకుస్థాపన చేయనున్నారు.
మరికొన్ని నిధులకు ప్రతిపాదనలు..
నల్లగొండలో ఇప్పటికే సుమారు రూ.1,800 కోట్లతో అభివృద్ధ్ది పనులను చేపట్టి విషయం తెలిసిం దే. ఇవే కాకుండా ఈనెల 15న మరో రూ. 590 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారు. అయితే జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పట్టణంలో మరో రూ. 102.74 కోట్లు అవసరం ఉన్నట్లుగా గుర్తించారు. వాటిని మంత్రి కేటీఆర్తో మంజూరు చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
మంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నాం
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు రూ.123.52 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి మరో రూ.590.01 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు రెండు లేదా మూడు ప్రాంతాల్లో శిలాఫలకాలు ఏర్పాటు చేయనున్నాం. అంతేగాకుండా పట్టణంలో అక్కడక్కడ మిగిలిపోయిన పనులను కూడా సాధించేందుకు రూ.102 కోట్ల ప్రతిపాదనలు కూడా రూపొందిస్తున్నాం.
-డాక్టర్ కేవీ రమణాచారి, మున్సిపల్ కమిషనర్ నల్లగొండ