నల్లగొండ ప్రతినిధి, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. వచ్చే పక్షం రోజుల్లో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో షెడ్యూల్కు ముందుగానే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసే దిశగా ఆయా పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల సమాయత్తంలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల్లోని లోటు పాట్లను విశ్లేషిస్తూ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు స్థానాలను గెలుపించుకునే దిశగా పార్టీ నేతలతో పాటు కార్యకర్తలంతా సమన్వయంతో ముందుకు సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లోనూ అందరికీ ఆమోదయోగ్యంగా, పార్టీ శ్రేణుల మనోభావాలకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలన్నదే అధినేత కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి కావచ్చినట్లు సమాచారం.
ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఉండవచ్చని తెలుస్తున్నది. ఇక బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా తన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రం నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా భువనగిరికి కూడా ఉంది. భువనగిరి నుంచి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. 2014లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలుపొందిన బూర నర్సయ్యగౌడ్ 2019లో ఓడిపోయారు. రెండేండ్ల కిందట బీజేపీ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తూ పార్టీలో చేరారు. శనివారం ప్రకటించిన జాబితాలో బీసీ కోటా నుంచి నర్సయ్యగౌడ్ను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇక నల్లగొండ స్థానంపై ఇంకా తర్జనభర్జన కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి గంగిడి మనోహర్రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, గార్లపాటి జితేందర్, నాగం వర్షిత్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో గంగడి మనోహర్రెడ్డి వైపు మొగ్గు చూపవచ్చని తెలుస్తున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం సరైన అభ్యర్థుల ఎంపిక కోసం పలు దఫాలుగా సర్వేలు నిర్వహించింది. సర్వేలతో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి అభిప్రాయాలు కూడా కీలకం కానున్నాయి.
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం నల్లగొండ స్థానం నుంచి కుందూరు రఘువీర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి సీరియస్గానే ప్రయత్నాలు చేస్తున్నా రఘువీర్రెడ్డికి దాదాపు ఖరారైనట్లు ఆ పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఇక భువనగిరి అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. సీనియర్ నేత చామల కిరణ్కుమార్రెడ్డి తనకే టికెట్ అన్న ధీమా వ్యక్తం చేస్తూ నియోజకవర్గంలో పర్యటనలు ముమ్మరం చేశారు.
భువనగిరి నుంచి పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని కూడా పోటీకి ఆహ్వానించినట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం కూడా వెల్లడించారు. రాహుల్గాంధీ సంగతి ఎలా ఉన్నా అభ్యర్థి ఎంపికలో కోమటిరెడ్డి బ్రదర్స్ నిర్ణయమే కీలకం కానుంది. వీలైతే తమ కుటుంబం నుంచే తమ అన్న మోహన్రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్రెడ్డిని రంగంలోకి దించాలని భావిస్తున్నారు. కానీ కోమటిరెడ్డి కుటుంబానికి మరో టికెట్ ఎలా అన్న విమర్శలు వస్తాయన్న భయం కూడా వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భువనగిరిలో ఎవరి వైపు బ్రదర్స్ మొగ్గుచూపుతారన్నది చర్చనీయాంశంగా మారింది.