‘నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణం. ఆ అభిరుచి మేరకు ఇంట్లో గార్డెన్, మిద్దెతోట, ల్యాండ్ స్కేప్ తయారు చేశాను. మా అమ్మ అగ్రికల్చర్ సైంటిస్ట్ కావడంతో బాల్యం నుంచే మొక్కలంటే మక్కువ పెరిగింది. మా ఇంటిలో సుమారు 100 రకాల మొక్కలు, 400 రకాల తొట్లు ఉన్నాయి. నేను ఎక్కడికి బదిలీ అయినా వాటన్నింటినీ నాతోపాటే తీసుకెళ్తాను. తెలంగాణ గార్డెన్ ఫెస్టివల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో నంబర్ వన్ గోల్డెన్ గార్డెన్ అవార్డు రావడం గర్వంగా ఉంది. పర్యావరణ హితంగా సేంద్రియ పద్ధతిలో నా నివాసంలో ఉద్యానవనం సుందరీకరణ, మిద్దెతోట పెంపకం, కిచెన్ గార్డెనింగ్ నిర్వహణకు అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’ అని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. తెలంగాణ గార్డెన్ ఫెస్టివల్ అవార్డు రావడంపై ఆమె నమస్తే తెలంగాణతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : తనకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణమని, ఆ అభిరుచి మేరకు ఇంట్లో గార్డెన్, మిద్దెతోట, ల్యాండ్ స్కేప్ తయారు చేశానని కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన ఆమె నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
గార్డెనింగ్ ఆలోచన ఎలా తోచింది?
నాకు మొక్కలంటే అమితమైన ఆసక్తి. నా చుట్టూ ఎప్పుడూ పచ్చదనం పరిఢవిల్లాలని కోరుకుంటాను. పచ్చదనం ఉంటే పని ఒత్తిడి కూడా మర్చిపోతాం. అందుకే నేను ఎక్కడికి బదిలీపై వెళ్లినా ఇంట్లో గార్డెన్, ల్యాండ్స్కేప్, మిద్దె తోట ఉండేలా చూసుకుంటాను. చిన్న స్థలంలోనే ఎక్కువగా మొక్కలు పెంచుకునే అలవాటు చిన్నప్పటి నుంచే వచ్చింది. ఇక్కడ కలెక్టరేట్లో మంచి స్థలం ఉండటంతో గార్డెనింగ్ ఏర్పాటు చేశాం. నేనే స్వయంగా మొక్కలకు నీళ్లు పెడుతుంటాను. ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తాను.
మొక్కలపై ఆసక్తికి మోటివేషన్ ఎవరు.?
వాస్తవానికి నాకు చిన్నప్పటి నుంచే మొక్కలంటే చాలా ఇష్టం ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే మొక్కలంటే ప్రాణం. మా అమ్మ అగ్రికల్చర్ సైంటిస్ట్. విధుల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో అమ్మ వెంటే వెళ్లేదానిని. అక్కడ అమ్మ ఫ్రెండ్స్ నాకు చిన్నచిన్న మొక్కలు గిఫ్ట్గా ఇచ్చేవారు. కొన్ని రకాల మట్టి తొట్లు కూడా ఇచ్చేవారు. నేను వాటిని భద్రంగా దాచుకునేది. కొత్తకొత్త మొక్కలపై ప్రయోగాలు చేశాను. రకరాకల మట్టి, ఇసుక, రాళ్లను సేకరించే దానిని. రోడ్ల వెంట కొత్త మొక్కలు, చెట్లు కనిపిస్తే తీసుకెళ్తాను. అంతేకాకుండా అమ్మనాన్నలు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తరుచూ బదిలీపై వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేవాళ్లం. అక్కడ అపార్ట్మెంట్లలో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే గార్డెనింగ్ చేసుకునేది. అప్పటి నుంచి మొక్కలపై ఆసక్తి పెరిగింది. విరివిగా మొక్కలను నాటడం అలవాటైంది.
మీ ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి.?
భువనగిరి కలెక్టరేట్ బంగ్లాలో సుమారు 100 రకాల మొక్కలు ఉన్నాయి. అరుదైన మొక్కలు అంటూ ఏమీ లేవు. 400 తొట్లు ఉంటాయి. ఎండాకాలం కావడంతో కొన్ని మొక్కలు చనిపోయాయి. ఇంట్లో, ఆఫీసులో కూడా నాకిష్టమైన మొక్కలు, తొట్లను ఉంచాను. ఇవి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి. నేను బదిలీపై వెళ్లినా మొక్కలను నా వెంట ప్రత్యేకంగా తీసుకెళ్తాను. నేను పెంచిన మొక్కలు అనేక మందికి గిఫ్ట్గా ఇస్తుంటాను.
రాష్ట్రస్థాయి అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది.?
రాష్ట్ర స్థాయిలో ఏడోసారి నిర్వహిస్తున్న ఫెస్టివల్లో భాగంగా నంబర్ వన్ గోల్డెన్ గార్డెనింగ్ అవార్డు నాకు వచ్చింది. కానీ వాస్తవానికి అవార్డుకు ప్రతిపాదనలు పంపాలనుకోలేదు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కృష్ణవేణి దరఖాస్తు చేద్దామని చెప్పడంతో స్టెప్ తీసుకున్నాం. ఆన్లైన్లో దరఖాస్తు చేశాం. నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం వచ్చి పరిశీలించింది. ఫొటోలు, ఇతర వివరాలన్నీ సేకరించుకుంది. ఇప్పుడు అనుకోకుండా రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ అవార్డు మున్ముందు మరింత పనిచేయాలనే ఉత్తేజాన్ని నింపింది.
ప్రజలకు మీరిచ్చే సూచనలు.?
ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత అందరిపై ఉంది. కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో విరివిగా మొక్కలు నాటాలి. మన ఇంట్లో, మిద్దెపై, ఇలా స్థలం ఉన్న ప్రతి చోటా ల్యాండ్స్కేప్ మాదిరిగా చేసుకోవాలి. చుట్టూ పచ్చదనం ఉండటం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణ కూడా ఉంటుంది.