హాలియా, ఫిబ్రవరి 6 : నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడంతో ప్రభుత్వం ఆయకట్టు పరిధిలో క్రాప్ హాలిడేని ప్రకటించింది. యాసంగిలో పంటలు సాగు చేయొద్దని వెల్లడించింది. దాంతో బోర్లు, బావుల కింద రైతులు కొద్ది మొత్తంలో వరి సాగు చేశారు. కానీ రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి తోటు కరెంట్ కోతలు కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఆయకట్టు పరిధిలోని హాలియా వాగుకు సాగర్ నుంచి నీటి విడుదల లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
తొమ్మిదేండ్లు రెండు కార్లు పండించిన రైతులు
2014 నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద రైతులు రెండు పంటలు పండించారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతోపాటు ప్రాజెక్టులో ఆశించిన జలాలు ఉండడంతో పెద్ద మొత్తంలో వరి వేశారు. సాగర్ నియోజకవర్గంలోనే లక్ష ఎకరాల్లో సాగు చేశారు. దీనికి తోడు 24 గంటల కరెంట్ ఉండడం కలిసి వచ్చింది. పంటల దిగుబడి బాగా రావడంతో రైతుల ఇంట నెలకొన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పరిస్థితి మారింది. వర్షాభావ పరిస్థితులకు తోడు సాగర్లో జలాలు లేకపోవడం, కరెంట్ కోతలతో పంటల సాగు కష్టంగా మారింది. యాసంగిలో 30 శాతమే వరి సాగు చేశారు. అది కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు.
హాలియా వాగు వెంట ఇదీ పరిస్థితి
అనుముల మండలంలో హాలియా వాగుకు ఇరువైపుల ఉన్న రైతులు వాగు నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. బోరుబావులతోపాటు, వాగులో మోటర్లు పెట్టి వరి పండిస్తున్నారు. గతేడాది వరకు బాగానే ఉండగా ఈ సంవత్సరం సాగర్ నుంచి నీటి విడుదల లేక వట్టిపోయింది. దీనికి తోడు హాలియా వాగుపై ఎగువన రెండు, మూడు చోట్ల నాబార్డు నిధులతో చెక్డ్యామ్లను నిర్మించారు. దాంతో ఎగువ నుంచి నీరు దిగువకు వచ్చే అవకాశం లేదు. రైతుల విజ్ఞప్తి మేరకు రెండు రోజులుగా మేజర్ కాల్వలకు సాగ ర్ నీటిని విడుదల చేసినా సరిపడా రాలేదు. హాలియా వాగును నమ్ముకొని వరి వేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో రైతు ఎకరానికి 15 వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా అవన్నీ నేలపాలయ్యేట ట్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట చేతికి వస్తదన్న నమ్మకం లేదు
నేను పేరూరు సోమేశ్వర స్వామి దేవాలయ భూమిని రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. కౌలు 28వేలు రూపాయలు. వానకాలంలో ఎడమ కాల్వ నీరు రాకపోవడంతో వాగుకు మోటర్ వేసి పారించాను. ఇప్పుడు వాగు కూడా ఎండిపోయింది. 15 రోజులుగా పంట పొలానికి సాగునీరు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఒకటి రెండు రోజులు సూరేపల్లి మేజర్కు సాగర్ నీళ్లు ఇవ్వడంతో పాలానికి పెట్టుకుంటున్నా. ఇంకా రెండు నెలలైతే పొలం చేతికి వస్తది. ఈ ఏడాది పంట చేతికి వస్తదన్న నమ్మకం లేదు. కౌలు గింజలన్న ఎల్లదీద్దామని వరి వేసే చేస్తే అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చింది.
-నాగేండ్ల రామలింగయ్య, కౌలు రైతు, ఇబ్రహింపేట, అనుముల మండలం
నీరు అందక పొలం ఎండిపోతున్నది
నేను మా ఊరిగుండా వెళ్తున్న హాలియా వాగు నీళ్లను నమ్ముకొని 3 ఎకరాల్లో వరిసాగు చేసిన. గతంలో వాగులో 365 రోజులు నీళ్లు ఉండేవి. ఈ ఏడాది వర్షాలు సరిపడా కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. బోర్లు పోస్తలేవు. కరెంట్ కూడా రోజుకు 16 గంటలకు మించి ఇవ్వడం లేదు. నీళ్లు లేక పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.
– చెన్నబోయిన శ్రీను, రైతు, రామడుగు, అనుముల మండలం