ఒలింగా.. ఓ లింగా స్మరణలు.. కాళ్ల గజ్జెల సవ్వడులు.. ఢమరుకం, భేరీల చప్పుళ్లు.. త్రిశూలాలు, బరిశెల విన్యాసాలతో చిందులు తొక్కుతూ యాదవ సంప్రదాయ నృత్యాల నడుమ ఆదివారం రాత్రి లక్షలాది మంది భక్తుల మధ్య పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. యాదవుల కులదైవం దురాజ్పల్లి లింగమంతుల(పెద్దగట్టు)వద్దకు ఆదివారం ఉదయం నుంచే భక్తుల రాక ప్రారంభం కాగా, అర్ధరాత్రి 12 గంటల తరువాత గుట్ట పరిసరాలన్నీ కిటకిటలాడాయి. సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టె, బోనం గంపను గుట్టపైకి తీసుకువచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవరపెట్టెలోని దేవతామూర్తులను ఆలయంలో ప్రతిష్ఠించారు. అంతకు ముందు కేసారం గ్రామంలో దేవతా విగ్రహాలకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పెట్టె మోసి తరలింపును ప్రారంభించారు. గొర్ల, మెంతబోయన వంశస్తుల ఇంటి నుంచి వెళ్లే బోనం, బియ్యం లింగమంతుల స్వామి, అమ్మవార్లకు పట్టు వస్ర్తాలను సమర్పించారు.
మధ్యాహ్నం నుంచే భక్తుల రాక..
జాతరకు ఆదివారం మధ్యాహ్నం నుంచే భక్తుల రాక ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటల తరువాత ఒక్కసారిగా లక్షలాదిగా వచ్చారు. జీపులు, ట్రాక్టర్లు, లారీలతోపాటు ఇతర వాహనాల్లో చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజన సందోహం సంప్రదాయ దుస్తులు ధరించి బోనాల గంపలను గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లిస్తున్నారు. మేక, గొర్రెపోతులను గుడిచుట్టూ తిప్పుతూ ఒలింగా.. ఓ లింగా అని స్మరిస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి తరువాత వాటిని బలివ్వనున్నారు. దురాజ్పల్లి గుట్ట పరిసరాలు దుకాణాలతో నిండిపోయాయి. ఎగ్జిబిషన్లు, జెయింట్ వీల్స్, బ్రేక్డ్యాన్స్ తదితరాలు జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గుడి పక్కన దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయం, గుట్ట కింద పోలీస్ కంట్రోల్ రూమ్, రెవెన్యూ, పంచాయతీ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, మోహన్రావు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. వివిధ శాఖల హెచ్ఓడీలు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సమస్యలు తలెత్తకుండా చూస్తున్నారు. ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు.
సంప్రదాయ పద్ధతిన గుట్టపైకి దేవరపెట్టె
33 మంది దేవతాగణంతో కూడిన దేవరపెట్టెను అర్ధరాత్రి సంప్రదాయ రీతిన పెద్దగట్టుపైకి తీసుకొచ్చిన అనంతరం దేవరపెట్టెలోని చౌడమ్మ, గంగ, యలమంచమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యమ్మతోపాటు ఐదుగురు రాజులు, ఐదుగురు చెంచులు, భూమినేడు, భూమసాని, వినాయకుడు, బ్రహ్మ, వరావతారం, బొల్లావు, గొల్లబామ, వసుదేవుడు, శ్రీకృష్ణుడు, పులి, భైరవుడు, పోతరాజు, బ్రాహ్మణుడు, నారథుడు, విశ్వామిత్రుడు, లింగమంతుల స్వామి, పాపనాక్షి, నాగేంద్రులను గుడి ముందు ప్రతిష్ఠించారు. దేవరపెట్టెను గుట్టపైకి తీసుకొచ్చిన అనంతరం దానిని బైకానీలు అలంకరించగా మెంతబోయిన, మున్న, గొర్ల వంశస్తుల సహకారంతో దేవరపెట్టెకు కుంకుమబొట్లు పెట్టి కొత్త చీరెను చుట్టి పూలమాలలు వేశారు. బైకానీలు సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తుండగా కథగాన రూపంలో లింగమంతులు, చౌడమ్మలను స్థుతిస్తూ మున్న, మెంతబోయిన, గొర్ల వంశీయులతో ధూపదీపారాధన చేశారు. గంపల్లో తీసుకొచ్చిన బోనాల్లోని కొంత అన్నం తీసి లింగమంతులస్వామి, చౌడమ్మకు నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, పెద్దగట్టు ఆలయ చైర్మన్ కోడి సైదులు, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, సర్పంచ్ మెంతబోయిన నాగయ్య, గొర్ల గన్నారెడ్డి, రమణారెడ్డి, మద్ది శ్రీనివాస్యాదవ్, జటంగి నాగరాజు, అనిల్, అధికారులు పాల్గొన్నారు.
ఆలయం చుట్టూ గంపలతో ప్రదక్షిణ
ఆచారం ప్రకారం గొల్ల హక్కుదారులైన మున్న, మెంతబోయిన వంశానికి చెందిన ప్రతి ఇంటి నుంచి స్త్రీలు మంద గంపలను నెత్తిన పెట్టుకొని గుట్టపైకి వచ్చారు. వీరు దేవరపెట్టె ఊరేగింపుతో పాటు గంపలను ఎత్తుకొని లింగమంతుల స్వామి, చౌడమ్మతల్లి దేవాలయం చుట్టూ తొలి ప్రదక్షిణలు చేసిన తరువాతే మిగిలిన భక్తుల గంపల ప్రదక్షిణలు ప్రారంభమయ్యాయి.
ఆహార పదార్థాల తనిఖీ
బొడ్రాయిబజార్ : జాతరకు వచ్చే వేలాది మంది భక్తులకు శుభ్రత, నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు విక్రయించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆదేశించారు. ఆదివారం ఫుడ్సేఫ్టీ బృందంతో కలిసి జాతరలో తయారు చేసిన ప్రసాదాలు, పలు రకాల తినుబండారాలను పరిశీలించారు. ఆహార పదార్థాల స్టాళ్లు, జ్యూస్ సెంటర్లు, పులిహోర, లడ్డూ ప్రసాదాల నాణ్యతను తనిఖీ చేశారు. కాలం చెల్లిన వాటిని గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. హానికరమైన, రసాయనాలు కలిపిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి ఫుడ్సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ కల్యాణ్చక్రవర్తి, ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, వనపర్తి జిల్లా ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ నీలిమ, యాదాద్రి, నల్లగొండ ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు.