ప్రజా వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నది. మరోవైపు జిల్లాకో మెడికల్ కళాశాలను తీసుకొచ్చి వైద్య విద్యను చేరువ చేసింది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు కొనసాగుతుండగా పక్కా భవనాలను నిర్మిస్తున్నది. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఉత్తర్వులిచ్చింది. నల్లగొండకు 42, సూర్యాపేటకు 45 పోస్టులు మంజూరు చేసింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, పిడియాట్రిక్తోపాటు వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నది. ఏకకాలంలో 87 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సూర్యాపేట(నమస్తేతెలంగాణ)/నీలగిరి, మే 24 : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వైద్యరంగంలో మరో నూతన అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు రెండు మెడికల్ కళాశాలలు కేటాయించి నూతన భవనాలు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ తాజాగా మరో అధ్యాయానికి నాంది పలికారు. ఆయా మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్లగొండ మెడికల్ కళాశాలలో 42, సూర్యాపేట మెడికల్ కళాశాలలో 45పోస్టులను తక్షణమే నియమించాలంటూ అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏకకాలంలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం ద్వారా వైద్య రంగంలో నూతనాధ్యాయం మొదలైంది.
నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ మెడికల్ కళాశాలలో మొత్తం 42 పోస్టులకు గానూ జనరల్ మెడిసిన్(5), జనరల్ సర్జన్(6), ఆర్థోపెడిక్(2), పీడియాట్రిక్(4), ఓబీజీ(8)అనస్థీషియా(7), అనాటమీ(1), పథాలజీ(1), మైక్రో బయాలజీ(1), ఫోరెన్సిక్ మెడిసిన్(1), రేడియో డయాగ్నసిస్ట్(2), బయోకెమిస్ట్రీ(1), కమ్యూనిటీ మెడిసిన్(1),ట్రాన్స్ఫ్యూజన్ మెడ్(1), ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్(1) చొప్పున మొత్తం 42 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా సూర్యాపేట మెడికల్ కళాశాలకు జనరల్ మెడిసిన్(5), జనరల్ సర్జన్(7), ఆర్థోపెడిక్(3), పీడియాట్రిక్(5), ఈఎన్టీ(1), ఓబీజీ(8), అనస్తీషియా(7), అనాటమీ(1), పథాలజీ,(2), మైక్రోబయాలజీ(1), ఫోరెన్సిక్మెడిసిన్(1), రేడియో డయాగ్నసిస్ట్(3), ఆప్తాలమిస్ట్ (1), కమ్యూనిటీ మెడిసిన్(1) కలిపి మొత్తం 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టనున్నది.
ముఖ్యమంత్రి కేసీర్కు ధన్యవాదాలు
ఏకకాలంలో నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కళాశాలలకు 87 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు అనుమతిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు ఈ నియామకాలు అద్దం పడుతాయి. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవల విస్తరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ కచ్చితంగా దోహదపడుతుంది. పేదలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి తేవడమే కాకుండా, అందుకు అనుగుణంగా నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
-గుంటకండ్ల జగదీశ్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి