స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు
యాదగిరిగుట్ట, జూలై 26: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో బుధవారం అష్టోత్తర శతఘటాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఆగమశాస్ర్తానుసారంగా వేదమంత్రాలతో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. కలశతీర్థం, పుణ్యజలానికి వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. ప్రధాన కలశంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. 108 కలశాల్లో పంచామృతాలు, పవిత్ర తీర్థ జలాలు, సుగంధ ఫల రసాలు, నారికేళ జలాలను ఉంచి పవిత్ర ద్రవ్యాలు, తీర్థరాజముతో కల్యాణ మూర్తులను, మూలవరులను అభిషేకించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే గిరిప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు సుదర్శన నారసింహహోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారు జామున స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. కుంకుమార్చన, ఆంజనేయస్వామివారి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా సాగాయి. స్వామివారిని సుమారు 5 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖాజానాకు రూ. 8,89,708 ఆదాయం సమకూరిందని ఈవో ఎన్.గీత తెలిపారు.
స్వామివారికి 12 వెండి కలశాల బహూకరణ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి పలువురు భక్తులు వెండి కలశాలను బహూకరించారు. బెంగళూరుకు చెందిన ఎన్వీ. ప్రసాద్, ఏఎన్. రావు కుటుంబ సభ్యులు 6 వెండికలశాలు, యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన గౌలికార్ శ్యామ్లాల్ కుటుంబ సభ్యులు 6 వెండి కలశాలను ఆలయ అధికారి సురేందర్రెడ్డికి అందించారు.