అర్వపల్లి, డిసెంబర్ 22 : తెలంగాణలో ప్రసిద్ధిగాంచి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలో ఉన్న హజ్రత్ ఖాజీ నసీరుద్దీన్బాబా దర్గా ఉర్సు శుక్రవారం ప్రారంభం కానుంది. రెండ్రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. శుక్రవారం సాయంత్రం అర్వపల్లి పోలీస్స్టేషన్ నుంచి గంధం (సందల్) ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో పాటు మండల ప్రజాప్రతినిధులు, వక్ఫ్ బోర్డు అధికారులు పాల్గొననున్నారు. అదే రోజు రాత్రి ఖవ్వాలి నిర్వహిస్తారు. శనివారం సాయంత్రం దీపారాధన (చిరాగ్) కార్యక్రమాలు జరుగుతాయని వక్ఫ్బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ మమమూద్ అలీ, ఖాదీం ఎండీ మౌలానా తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దర్గా పరిసరాలను శుభ్రం చేశారు. దర్గాను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. గంధం ఊరేగింపు సందర్భంగా భక్తులు క్యూలైన్లో రావడానికి బారీకేడ్లను ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను నాగారం సీఐ రాజేశ్, అర్వపల్లి ఎస్ఐ అంజిరెడ్డి పరిశీలించారు. దర్గా సమీపంలో భక్తులు బస చేసే ప్రాంతం, వాహనాల పార్కింగ్, దుకాణాల ఏర్పాటు ప్రాంతాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. 40మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం
ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుగలేదు. ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదున ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉర్సును విజయవంతం చేయాలి.
– ఖాదీం ఎండీ మౌలానా