నందికొండ, నవంబర్ 4 : హైదరాబాద్లోని గోల్కొండలో ఆర్మీ సెంటర్ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెఫ్టినెంట్ కర్నల్ మనోజ్ నాయర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బైక్ ర్యాలీ శుక్రవారం నాగార్జునసాగర్ చేరుకున్నది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కర్నల్ మనోజ్ నాయర్ మాట్లాడుతూ గోల్కొండలో 1962లో ఏర్పాటు చేసిన ఆర్మీ సెంటర్ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
12 మంది ఆర్మీ జవాన్లతో అక్టోబర్ 23న హైదరాబాద్లో ర్యాలీ ప్రారంభించి అనంతపురం, బెంగళూర్, శీలం, మధురై, రామేశ్వరం నుంచి హర్యానాలోని ధనుస్కోడ్ వరకు నిర్వహించినట్లు చెప్పారు. తిరుగు ప్రయాణంలో పుదుచ్చేరి, చెన్నై, శ్రీహరికోట మీదుగా నాగార్జునసాగర్ చేరుకున్నట్లు వివరించారు. శనివారం హైదరాబాద్ చేరుకోవడంతో ర్యాలీ ముగుస్తుందన్నారు. 13 రోజుల పాటు కొనసాగిన ర్యాలీకి హీరో కంపెనీ మోటర్ సైకిళ్లు, సర్వీసింగ్ను, హిందుస్తాన్ పెట్రోలియం పెట్రోల్ను, టీఎక్స్ దవాఖాన వైద్య సేవలను అందించాయన్నారు.
నందికొండ చేరుకున్న బృందానికి నందికొండ మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, సీఐ నాగరాజు. బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజినీకాంత్, పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు, ఎన్నెస్పీ డీఈ పరమేశ్, అధికారులు స్వాగతం పలికారు. అంతకు ముందు నాగార్జునసాగర్ డ్యాం, గ్యాలరీ, క్రస్ట్ గేట్లను బైక్ ర్యాలీ బృంద సభ్యులు సందర్శించారు. వీరితో ఎన్ఎస్పీ, మున్సిపాలిటీ, పోలీస్ అధికారులు ఉన్నారు.