యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26 : యాదగిరిగుట్ట ప్రధానాలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. కొండపైకి వాహనాల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి నిత్యోత్సవాలు మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామిని సుమారు 35వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.41,28,791 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
శ్రీవారిని ప్రముఖ నిర్మాత దిల్రాజు కుటుంబ సమేతంగా, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు. వారి వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్గౌడ్, సుడుగు శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.