ఉమ్మడి రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయమై.. మోడువారిన సూర్యాపేట ప్రాంతం నేడు అత్యంత అహ్లాదకరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఉద్యమ రీతిన చేపడుతున్న హరితహారం.. పుష్కలంగా సాగు నీళ్లు అందిస్తుండడంతో జిల్లాలో పచ్చదనం వికసిస్తున్నది. తొమ్మిదేండ్లలో దాదాపు 20 కోట్ల మొక్కలు నాటడంతో నేడు ఎక్కడికక్కడ అడవులు దర్శనమిస్తున్నాయి.
సాధారణంగా భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా.. సూర్యాపేట జిల్లాలో రికార్డుల ప్రకారం 2.5 శాతం ఉన్నది. వాస్తవ పరిస్థితిలో మాత్రం ఒక శాతం కూడా లేదు. పేరుకు 27,650 ఎకరాల అటవీ భూములు ఉండగా.. పచ్చదనం ఎక్కడా లేదు. ఇక పల్లెలు, రహదారుల వెంట కనీసం ఐదు నిమిషాలు సేద తీరేందుకు పచ్చని చెట్టు మచ్చుకు కూడా కనిపించేది కాదు. అలాంటిది హరితహారంతో జిల్లాలో ఎక్కడికక్కడ అడవులను తలపించే రీతిన మొక్కలు చెట్లుగా పెరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో ఉద్యమంలా ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో తొమ్మిదేండ్లలో పచ్చని సూర్యాపేటగా మారింది. జిల్లా వ్యాప్తంగా 6,19,989 ఎకరాల భూమి ఉండగా.. అందులో 33 శాతం అటవీ భూములు ఉండాలి. కానీ.. 2014కు ముందు పట్టుమని 10వేల ఎకరాల్లో కూడా అడవి లేకపోగా.. ఏడు హరితహారాల్లో పల్లెలు, పట్టణాల రహదారులతోపాటు జాతీయ రహదారులు, ఇంటర్నల్ రోడ్లు వెంట విరివిగా మొక్కలు నాటారు. ఆ ఏరియా సుమారు 67,477 ఎకరాలుగా ఉన్నది.
జిల్లాలో 27,650 ఎకరాల అటవీ భూముల్లో 2.17 కోట్ల మొక్కలు నాటడంతోపాటు విత్తన బంతులు వేశారు. గ్రామాలు, పట్టణాల రహదారులు, హైవేలతోపాటు అంతర్గత రోడ్లు కలిపి సుమారు 7,106 కిలోమీటర్ల పొడవునా రెండు పక్కల నాటిన మొక్కలు దాదాపు 27,450 ఎకరాలు ఉన్నది. వీటికితోడు జిల్లాలోని 473 పల్లె ప్రకృతి వనాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు ఇలా అన్నీ కలిపి మరో 12,377 ఎకరాల్లో సుమారు 12 కోట్ల వరకు మొక్కలు నాటగా అవి నేడు ఏపుగా పెరిగి అడవులను తలపిస్తున్నాయి. ఇక అటవీ భూముల విషయానికి వస్తే.. జిల్లాలో దాదాపు 42వేల ఎకరాలకు పైనే అటవీ భూములు ఉండగా గతంలో వాటి సంరక్షణను ఎవరూ పట్టించుకోలేదు.
దీంతో దశాబ్దాల తరబడి అన్యాక్రాంతం అవుతూ నేడు 27,650 ఎకరాలకు కుదించబడింది. రికార్డుల ప్రకారం అవి అడవులు అయినా.. వాటిలో పచ్చదనం కనిపించకపోయేది. అలాంటిది తొమ్మిదేండ్ల క్రితం హరితహారం ప్రారంభం కాగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో దాదాపు 3 కోట్ల వరకు మొక్కలు నాటడంతోపాటు విత్తన బంతులు చల్లించడంతో నేడు పచ్చగా మారుతున్నది.
తొమ్మిదేండ్లుగా హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి పచ్చదనం పంచుతుండడంతో సకాలంలో వర్షాలు పడడంతోపాటు ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతున్నాయి. ఐదారేండ్ల క్రితం వరకు రాష్ట్రంలో రామగుండం, కొత్తగూడెం తదితర అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాలతో సూర్యాపేట పోటీ పడి రికార్డు స్థాయిలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదైన విషయం విదితమే. అలాంటిది గత మూడేండ్లుగా 44 డిగ్రీలకు మించి నమోదు కాకపోవడం గమనార్హం. ఇక వర్షాలు పడక దశాబ్దాల తరబడి కరువు ప్రాంతంగా ఉన్న సూర్యాపేట జిల్లాలోని దాదాపు 70శాతం భూములు బీళ్లుగా ఉండగా.. నేడు భారీ వర్షపాతం నమోదు కావడంతోపాటు నదుల నీళ్లు కూడా వస్తుండడంతో కరువు దూరమైంది.