రాష్ట్రంలో రెండో అతిపెద్దదిగా పేరుగాంచిన దురాజ్పల్లి లింగమంతులస్వామి జాతరకు సంబంధించి ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మార్గనిర్దేశకంలో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీస సౌకర్యాలకు నోచని పెద్దగట్టు ఇప్పుడు సకల సౌలత్లతో జాతరకు సిద్ధమైంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యమిస్తూ పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. గుడి చుట్టూ చలువ పందిళ్లు వేశారు. కొనేరును ముస్తాబు చేశారు. చెరువు చుట్టూ బారికేడ్లు కట్టారు. భక్తుల కోసం ఆర్టీసీ 60 స్పెషల్ బస్సులను కేటాయించింది. జాతరలో 24 గంటల పాటు విద్యుత్, వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
గుట్ట చుట్టూ నల్లాలు.. భగీరథ నీటి సరఫరా
జాతరకు వచ్చే భక్తులకు 24 గంటలపాటు శుద్ధ జలమైన మిషన్ భగీరథ నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి దురాజ్పల్లి లింగమంతుల స్వామి గుట్టపై ఉన్న 20 వేల లీటర్ల ట్యాంక్ను నింపి, నిరంతరం గుట్టు చుట్టూ ఏర్పాటు చేసిన నల్లాల ద్వారా నీటిని అందించనున్నారు. దీని కోసం రూ.49 లక్షలు కేటాయించారు. గుట్ట చుట్టూ 5 చోట్ల 20 నల్లాలు, 3 వాటర్ టబ్బులు ఏర్పాటు చేయగా పార్కిగ్ ప్రదేశాలకు కూడా తాగునీటిని అందించనున్నారు. భగీరథ నీటికి అంతరాయం కలిగితే బోర్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు మున్సిపల్ అధికారులు సైతం 5 ట్యాంకర్లను ఏర్పాటు చేసి నిరంతరం భక్తులకు తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
60 బస్సుల కేటాయింపు
జాతర కోసం టీఎస్ఆర్టీసీ 60 బస్సులను కేటాయించింది. సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి నిరంతరం బస్సులు నడిపించేందుకు సిద్ధం చేసింది. కొత్తబస్టాండ్, ఖమ్మం క్రాస్ రోడ్డు, పీఎస్ఆర్ సెంటర్లలో బస్ పాయింట్లను ఏర్పాటు చేసింది. జాతర కోసం వచ్చే భక్తులను తరలించేందుకు టికెట్ ధరలను సైతం నిర్ణయించింది. పెద్దలకు రూ.30, చిన్న పిల్లలకు రూ. 20 చొప్పున తీసుకోనున్నది.
పెద్దగట్టు జాతరలో హై సెక్యూరిటీ
పెద్దగట్టు జాతరకు హై సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ అడ్మిన్ ఆర్ఐ శ్రీనివాస్రావు తెలిపారు. గురువారం పెద్దగట్టు పరిసర ప్రాంతాలను బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ సెక్యూరిటీ సిబ్బందితో పరిశీలించి మాట్లాడారు. జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు బాంబ్ స్కాడ్ ద్వారా గుట్ట చుట్టూ పరిశీలించినట్లు తెలిపారు.
జాతర కోసం 48.28 ఎకరాల సేకరణ
జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం గుట్ట చుట్టూ ఉన్న రైతుల స్థలాలను తాత్కాలికంగా సేకరించింది. దురాజ్పల్లి, ఖాసీంపేట గ్రామాలకు చెందిన సుమారు 15 మంది రైతుల నుంచి 48.28 ఎకరాలను వినియోగించనున్నది. ఒక ఎకరాకు రూ.25 వేల చొప్పున పంట నష్టం చెల్లించనున్నది. వాటిలోఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం 6 ఎకరాలు, మిగతా 43 ఎకరాలను భక్తుల కోసం కేటాయించారు.
చెరువు చుట్టూ భద్రత కట్టుదిట్టం
లింగమంతుల స్వామి గుట్ట పక్కనే చెరువు ఉన్నది. గత జాతర సమయంలో చెరువు ఎండి పోయి ఉండడంతో ఇబ్బంది లేకుండా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం చెరువును నింపడంతో నిత్యం నీటితో కళకళలాడుతున్నది. అక్కడ ప్రమాదాలు జరుగకుండా చెరువు చుట్టూ కట్టెలు కట్టి భద్రత కట్టుదిట్టం చేశారు. చెరువులోకి దిగకుండా నిరంతరం నిఘా పెట్టనున్నారు.
పారిశుధ్య లోపం లేకుండా..
లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరలో పారిశుధ్య లోపం లేకుండా మున్సిపల్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రోజుకు 560 మంది పారిశుధ్య సిబ్బంది మూడు షిఫ్ట్లుగా విధులు నిర్వహించనున్నారు. ఎప్పటికప్పుడు చెత్త సేకరణ, గుట్టపై ఉన్న రక్తం మరకలను, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయనున్నారు. 5 ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించనున్నారు. గుట్ట చుట్టూ, దురాజ్పల్లిలో కలిపి 7 ప్రాంతాల్లో శాశ్వత మరుగుదొడ్లు నిర్మించగా, 60 చోట్ల బయో టాయిలెట్స్ను ఏర్పాటు చేశారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి వాకిటాకీలను వినియోగించనున్నారు.
ప్రత్యేకాకర్షణగా కోనేరు
జాతరలో కోనేరుకు ప్రత్యేకత ఉంది. 2015లో మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవతో కోనేరును నిర్మించారు. అప్పటి నుంచి భక్తులు అందులోనే స్నానాలు చేస్తున్నారు. బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. కోనేటి మధ్యలో పెద్ద శివుని ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటున్నది. నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు.
8 వైద్య శిబిరాలు
జాతరలో భక్తుల కోసం వైద్య ఆరో గ్య శాఖ ఆధ్వర్యంలో 8 శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో శిబిరంలో డాక్టర్తోపాటు 9 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. పెద్దగట్టుపై, మర్రి చెట్టు వద్ద, ప్రధాన ద్వారాల పక్కన, దురాజ్పల్లి వద్ద, కోదాడ రోడ్డులో, ఖాసీంపేట రోడ్డులో, పార్కింగ్ ప్రదేశంలో ఈ శిబిరాలు ఉండనున్నాయి. ఎమర్జెనీ కోసం 108, టూ వీలర్ అంబులెన్స్లు అందుబాటులో ఉండనున్నాయి.
విద్యుత్ వెలుగులు
జాతరలో రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్ట చుట్టూ 16 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా అదనంగా మరో రెండు సిద్ధంగా ఉంచారు. జాతర కోసం 120 విద్యుత్ పోల్స్ వేయగా మరో 30 వరకు విద్యుత్ పోల్స్ అందుబాటులో ఉంచారు. జాతరకు దురాజ్పల్లి సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుండగా అంతరాయం కలిగితే సూర్యాపేట మండలం ఇమాంపేట, సూర్యాపేట ఇండస్ట్రియల్ ఏరియా సబ్ స్టేషన్ల నుంచి లైన్ తీసుకోనున్నారు. సూర్యాపేట డీఈతోపాటు 10 మంది ఏఈలు, సుమారు 100 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 3వేల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు.
సరికొత్తగా పెద్దగట్టు లింగమంతుల స్వామి గుడి
చివ్వెంల, ఫిబ్రవరి 2 : పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయానికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఎన్ని జాతరలు వచ్చినా గత ప్రభుత్వాలు ఆలయ అభివృద్ధిని, భక్తుల వసతులను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2015 సంవత్సరంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. సకల సౌకర్యాలు కల్పించారు. గుడి పునర్నిర్మాణం చేపట్టి అన్ని హంగులతో తీర్చిదిద్దారు. నాటికి నేటికి తేడాను చూసిన భక్తులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.