సంక్రాంతి పండుగ నేపథ్యంలో 65వ జాతీయ రహదారి రద్దీగా మారుతున్నది. ఈ నెల 13నుంచి 17వరకు విద్యాసంస్థలకు సెలవులు రావడం, శని, ఆదివారం పండుగ కావడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు భాగ్యనగర వాసులు ప్రయాణమవుతున్నారు. హైవేపై ప్రమాదాలు, రద్దీ నివారణకు జీఎమ్మార్, పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు
65వ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 45మంది అదనపు సిబ్బందిని నియమించారు. వీరు దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్లబావి తదితర క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ ఏర్పడకుండా, తప్పుడు మార్గంలో వాహనదారులు ప్రయాణించకుండా, ప్రమాదాలు చోటుచేసుకుండా సూచనలు చేస్తారు. ఎక్కడైనా ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్రేన్, అంబులెన్స్ను అందుబాటులో ఉంచనున్నారు. దండు మల్కాపురం, పంతంగి, నార్కట్పల్లి, కట్టంగూరు, కొర్లపహాడ్, కేతేపల్లి తదితర గ్రామాల జాతీయ రహదారిపైనా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు కూడా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు.
ఫాస్టాగ్ ఉండాలి
వేగంగా వెళ్లాలంటే ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండాలి. లేకుంటే టోల్ప్లాజా వద్ద నాలుగైదు నిమిషాలు పట్టే అవకాశం ఉన్నది. ఫాస్టాగ్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవడం మంచిది. లేకుంటే. డబుల్ చార్జి పడుతుంది. ఫాస్టాగ్ స్టిక్కర్ కనపడకుండా వాహన అద్దంపై దుమ్ము పడినా, అద్దం పలిగినా సెన్సార్ స్కాన్ చేయదు. దానిపై అప్రమత్తంగా ఉండాలి.
సాధారణానికి మించి 10వేల వాహనాలు
పంతంగి టోల్ మీదుగా సాధారణ రోజుల్లో 30వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. శుభాకార్యాలు, సెలవుదినాల్లో మరో 2వేలు అదనంగా వెళ్లుంటాయి. సంక్రాంతికి మరో 10వేలు దాటే అవకాశం ఉన్నది.
కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద 7 కౌంటర్లు ఓపెన్
కేతేపల్లి : సంక్రాంతి పండుగ నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద విజయవాడవైపు ప్రస్తుతం 7 కౌంటర్లను ఓపెన్ చేశారు. విజయవాడ, హైదరాబాద్ వైపు మొత్తం 12 కౌంటర్లు ఉండగా రద్దీకనుగుణంగా కౌంటర్లను ఒకవైపు పెంచనున్నారు. సాధారణ సమయాల్లో ఇరువైపులా రోజుకు సుమారు 20 వేల వరకు వాహనాలు టోల్ప్లాజా నుంచి వెళ్తాయి. పండుగ సీజన్లో మరో 5 నుంచి 10 వేల వరకు పెరిగే అవకాశం ఉన్నది. వేగ నియంత్రణకు హైవేపై స్పీడో మీటర్ల ఏర్పాటు చేసినట్లు కేతేపల్లి ఎస్ఐ ఎం.అనిల్రెడ్డి తెలిపారు.
ఫాస్టాగ్ రీచార్జి చేసుకోవాలి
వాహనదారులు తప్పకుండా ఫాస్టాగ్ రీచార్జి చేసుకోవాలి. తద్వారా టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఉండదు. ఫాస్టాగ్ లేకుండా టోల్ రుసుము రెండింతలు చెల్లించాల్సిందే. ప్రయాణికులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే 1033 నంబర్ సంప్రందించాలి.
– శ్రీధర్ రెడ్డి, జీఎమ్మార్ మేనేజర్
ట్రాఫిక్ నియంత్రణకు అదనపు సిబ్బంది
చౌటుప్పల్ పట్టణంతోపాటు, హైవేపై ప్రధాన కూడళ్లు, పంతంగి టోల్ప్లాజా వద్ద అదనపు ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. క్రేన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది ఉంటే 100లేదా 9490617111 వాట్సాప్ నంబర్ను సంప్రదించవచ్చు.
-కేవీ విజయ్కుమార్, ట్రాఫిక్ సీఐ
మొదలైన రద్దీ
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బుధవారం ఏపీకి వెళ్లే వాహనాలు స్వల్పంగా బారులుతీరాయి. సంక్రాంతి పండుగ హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. దీంతో పట్టణ కేంద్రంలో రద్దీ ఏర్పడింది. హైవేపై కార్లు, ప్రైవేట్ బస్సులు అధికంగా కనిపిస్తున్నాయి. గురు, శుక్రవారం ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉన్నది.