నల్లగొండ రూరల్, జూలై 01 : భారతదేశంలో ప్రభుత్వ రంగ బీమా రంగ ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం, ఎల్ఐసీ పరిరక్షణ కోసం ఏర్పాటైన అత్యంత పురాతనమైన, అతిపెద్ద ట్రేడ్ యూనియన్ “ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్” (AIIEA) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఏఐఐఈఏ ఫార్మేషన్ డేను పురస్కరించుకుని ఇక్కడి ఎల్ఐసీ బ్రాంచ్-1 కార్యాలయ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీఈయూ (ICEU) ఉపాధ్యక్షుడు కామ్రేడ్ పెరుమాళ్ల మల్లేశం అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం బీమా రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే కాపాడుకుంటామని, ప్రజల సొమ్మును దేశ వికాసానికి ఉపయోగపడేలా నిరంతరం కృషి చేస్తామని, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడుతామని ఈ సందర్భంగా ఉద్యోగులందరూ కలిసి ఘనంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నాయకులు, ఉద్యోగులు ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకుని ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో నల్లగొండ బ్రాంచ్-1 మేనేజర్ ఏ.వెంకటేశ్వర రెడ్డి, ఏఓఐ రాష్ట్ర నాయకులు నలపరాజు సైదులు, బి.రామలింగం, క్లాస్-2 ఫెడరేషన్ నాయకుడు వెంకటేశ్వర్లు ప్రసంగించారు. 1951 జూలై 1న బొంబాయిలో ఏర్పాటైన AIIEA.. నాటి నుంచి నేటి వరకు భీమా రంగ పరిరక్షణలో, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరియు ఉద్యోగుల సంక్షేమం కోసం జరిపిన చారిత్రాత్మక పోరాటాలను వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ వేడుకల్లో ఐసీఈయూ నల్లగొండ బ్రాంచ్-1 అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు వెంకన్న, ఐతగోని లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఉద్యోగి వేముల కృష్ణయ్య, ఏఏఓలు కరుణ, వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అలాగే ఐసీఈయూ ప్రతినిధులు ఎస్. సందీప్, పల్లపు లింగయ్య, ఎం. రామకృష్ణ, గుండగోని శ్రీనివాస్, వింజమూరి శ్రీనివాస్, లకడాపురం రామకృష్ణ, దేవగిరి అంజయ్య, పాలెం శ్రీకాంత్, కాటం వెంకటేశం, ఎన్. రామకృష్ణ, పరాంకుశం గోపికృష్ణ, బొల్లు సుధాకర్ తదితర బీమా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.