నీలగిరి/మిర్యాలగూడ/పాలకవీడు, జూన్ 6: మిర్యాలగూడలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ ఇంటితో పాటు కార్యాలయంలో శనివారం ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఆయన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. అయితే పెద్దవూర మండలంలో మసీదు భూమి సర్వే రిపోర్టు కోసం రూ.పది వేల లంచం డిమాండ్ చేసిన విషయంపై నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు అతడిని వల పన్ని పట్టుకున్నారు.
ఆయన ఇచ్చిన సమాచారం మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని వక్ఫ్బోర్డు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. విలువైన పత్రా ల కోసం అధికారులు రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న పలు రికార్డులపై ఆరా తీశారు. పట్టణంలోని ఆయన నివాసంలో ఏసీబీ ఆధికారులు తనిఖీ చేశారు. కార్యాలయం తలుపులు మూసేసి ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సోదాల్లో పలు విలువైన డాక్యుమెంట్లను, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ జగదీశ్చందర్ మీడియాకు వివరాలను వెల్లడించారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూరలో ఓ మసీదుకు 900 గజాల స్థలం ఉంది. ఈ స్థలంపై గత కొంతకాలంగా వివాదం నెలకొంది. వక్ఫ్బోర్డు స్వాధీనం చేసుకొని ఆ స్థలాన్ని కాపాడాలని మసీదు నిర్వాహకుడు గతంలో లేఖ రాశాడని చెప్పారు. ఉన్నతాధికారులు స్థలాన్ని సర్వే చేసి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో గత నెలలో సర్వేయర్తో కలిసి వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ సర్వే నిర్వహించారని చెప్పారు. లంచం ఇస్తేనే సర్వే రిపోర్టు ఇస్తానని మసీదు నిర్వాహకుడిని ఇన్స్పెక్టర్ మహమూద్ ఇబ్బందులకు గురి చేశాడని చెప్పారు. దీంతో బాధితుడు తమను ఆశ్రయించాడని తెలిపారు. శనివారం మిర్యాలగూడ బస్టాండ్లో ఇన్స్పెక్టర్ మహమూద్కు బాధితుడు రూ.10 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. లంచం సొమ్ము రూ.10 వేలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మహమూద్ను జ్యుడీషియల్ రిమాండ్ కోసం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.