రామగిరి, మార్చి 30 : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ ప్రెసిడెంట్ హనుమాన్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా రోడ్ల మలుపుల వద్ద కంకర, రాళ్లు, డస్ట్ పేరుకుపోవడంతో వాహనాలు జారి పడుతున్నట్లు తెలిపారు. దుమ్ము అధికంగా లేవడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం ఏఈ ఆఫీస్ ముందు ధర్నా చేసినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం దురదృష్టకరం అన్నారు. ఈ నిర్లక్ష్యం వల్లే ఆదివారం ఇద్దరు విద్యార్థులు బైక్పై వెళ్తూ జారి పడ్డట్లు వెల్లడించారు. విద్యార్థుల సమస్యలను సీరియస్గా తీసుకోకపోవడం యాజమాన్య వైఫల్యమని అన్నారు. దీనికి నిరసనగా విద్యార్థుల భద్రత దృష్ట్యా నిర్మాణ పనులను తాత్కాలికంగా ఆపివేశామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సంపత్, అజయ్, సుధీర్, సతీష్, విజయ్, వెంకటేష్, నందు, సాయి తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.