శాస్ర్తోక్తంగా స్వామివారికి నిత్యోత్సవాలు
హుండీల ద్వారా రూ.59,20,615 ఆదాయం
యాదాద్రి, జూలై 5 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. క్యూ కాంఫ్లెక్స్లోని ఆలయంలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు చేపట్టి ఉదయం ఆరగింపు నిర్వహించారు. నిజాభిషేకం అనంతరం తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. నిత్యపూజల్లో భాగంగా ప్రధానాలయం ఉత్తరదిశలోని మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాయంత్రం వేళ ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్భార్ సేవలు సంప్రదాయంగా జరిగాయి. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన
సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రత మాచరించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి.
హుండీల ఆదాయం రూ.59,20,615
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి 7 రోజుల హుండీల ఆదాయం రూ.59 లక్షలు దాటిందని యాదాద్రి ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండపైన హరిత హోటల్లో హుండీలను లెక్కించగా, రూ.59,20,615 ఆదాయం వచ్చిందని చెప్పారు. మిశ్రమ బంగారం 44 గ్రాములు, మిశ్రమ వెండి 1100 గ్రాములు, అమెరికా డాలర్లు 345, యూఏఈకి చెందిన 10 దీరామ్స్, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 15 కెనడా డాలర్లు, మలేషియాకు చెందిన 3 రిగ్గిట్స్, 10 యూరో కరెన్సీలు సమకూరినట్లు వివరించారు. వివిధ విభాగాలు కలుపుకుని స్వామివారి ఖజానాకు మంగళవారం రూ.15,43,155 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రముఖులు..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర జల వనరులశాఖ సంస్థ చైర్మన్ వీరమళ్ల ప్రకాశ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారితోపాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.