యాదాద్రి భువనగిరి, జూన్ 11(నమస్తే తెలంగాణ): ఇప్పటికే వ్యాపారం పూర్తిగా పడిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అల్లాడుతుంటే.. ప్రభు త్వం భూముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్లపై భారీ ఎఫెక్ట్ పడింది. భూముల విలు వ పెంపు భారంగా మారడంతో ఇండ్లు, ఇండ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి జనం ఆసక్తి చూపించడంలేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు క్రయ విక్రయదారులు లేక వెలవెలబోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 60 నుంచి 70 శాతం స్లాట్స్ పడిపోయాయి. ఫలితంగా డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి పడిపోయింది. మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం సైతం పడిపోతున్నది.
రిజిస్ట్రేషన్లు 70 శాతానికి డౌన్..
యాదాద్రిలో భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్, చౌటుప్పల్, మోత్కూరు, రామన్నపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నా యి. హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో ఇక్కడి భూములకు డిమాండ్ బాగానే ఉంది. కానీ ఇటీవల రియల్ ఎస్టేట్ పడిపోవడంతో కొద్ది మేర ప్రభావం పడింది. ఇంతలోనే భూముల విలువ పెంచడంతో ఉన్న కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పూర్తిగా పడిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్లు కూడా భారీగా పడిపోయాయి. యాదాద్రిలో సుమారుగా 60 నుంచి 70 శాతం రిజిస్ట్రేషన్లు పడిపోయా యి. భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి జనం ముందుకు రావడంలేదు.
భువనగిరిలో రోజుకు 40కి పైగా రిజిస్ట్రేషన్లు అయ్యేవి. ఇప్పుడు వాటి సంఖ్య కేవలం 15 లోపు మాత్రమే. యాదగిరిగుట్టలో ఇటీవల వరకు నిత్యం 60 నుంచి 70 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యేవి. ఇప్పుడు 30 నుంచి 40 మాత్రమే జరుగుతున్నాయి. చౌటుప్పల్లో జూన్ 5 కంటే ముందు నిత్యం 30 నుంచి 40 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యేవి. ఇప్పుడు కేవలం రెండు నుంచి మూడు మాత్రమే జరుగుతున్నాయి. మోత్కూరులో రోజుకు 10 నుంచి 12 కాగా.. ప్రస్తుతం మూడు నుంచి నాలుగు, రామన్నపేటలో 12 నుంచి 14కి బదులుగా నాలుగైదు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ గత నెలలో 250 ఉండగా ఈ నెలలో ఇప్పటి వరకు కేవలం 25 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయ్యాయి. దీంతో కార్యాలయాలన్నీ జనం లేక బోసిపోతున్నాయి. మరో వైపు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా భారీగా పడిపోయింది.

డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి గండి
భూమి విలువ పెంపుతో అన్ని వర్గాలకు ఇబ్బందులు తప్పడంలేదు. రియల్ వ్యాపారులపై కొనుగోళ్లపై ప్రభావం పడింది. ఇక డాక్యుమెంటు రైటర్లకు ఉపాధి లేకుండా పోయింది. ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు పడిపోవడంతో అంద రూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒక్కో రైటర్కు ప్రాంతాన్ని బట్టి నాలుగైదు డాక్యుమెంట్లు వచ్చేవి. ఇప్పు డు ఒక్కటి కూడా రావడంలేదు. ఫలితంగా ఆఫీసు కిరాయిలు, చిరుద్యోగులకు జీతాలు తదితర ఖర్చులు అన్నింటికీ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. భూముల విలువ పెంపుతో ఏం చేయాలో అర్థం కావడంలేదని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అంతంత మాత్రంగానే స్లాట్స్ బుక్ అయ్యేవని ఇప్పుడు అవి కూడా కావడంలేదని వాపోతున్నారు.
విలువ పెంపు.. ప్రజలపై ఆర్థిక భారం
ప్రభుత్వం భూములతోపాటు, ప్లాట్ల మార్కెట్ విలువ పెంచింది. ఈనెల 5 నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.ఇందుకు సంబంధించి వివరాలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వెబ్సైట్లో పొందుపరిచారు. భూమి విలువ సుమారు 90శాతం వరకు పెంచారు. భువనగిరిలోని ప్రైమ్ ఏరియాల్లో గజం భూమి విలువ అత్యధికంగా రూ.48,300 పలుకుతున్నది. ఫిష్ మార్కెట్ నుంచి కృష్ణా జువెల్లర్స్, హన్మకొండ రోడ్డు నుంచి ముస్తఫా చికెన్ సెంటర్, పాత ఎస్బీహెచ్ నుంచి ప్రిన్స్ వరకు, మార్కెట్, జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న స్థలాలను గజానికి రూ. 48,300కి పెంచారు.
మండలాల్లో సైతం మార్కెట్ విలువ భారీగా పెరిగింది. భూముల విలువ పెంపుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి ఇండ్లు, ప్లాట్లు కొందామన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు.. చౌటుప్పల్ మండలంలో ఇటీవల వరకు 200 గజాల ప్లాట్కు రూ.18వేల స్టాంప్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు అది ఏకంగా రూ. 28 వేలకు పెరిగింది. భువనగిరి మండలంలో 200 గజాలకు రూ.32,500 ఉండగా, ఇప్పుడది రూ. 57,500కి పెరిగింది.