పల్లె ప్రగతితో మెరిసిన గ్రామం
సీసీ రోడ్లు, వైకుంఠధామం, మిషన్ భగీరథ ట్యాంక్
పరుచుకున్న పచ్చదనం, స్వచ్ఛతగా పరిసరాలు
చేవెళ్ల టౌన్, మార్చి26: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో చేవెళ్ల మండలంలోని పామెన గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. గతంలో నిధుల్లేక అభివృద్ధికి ఆమడ దూరంలో పంచాయతీలు ఉండేవి. ఇప్పడు గ్రామాల్లో సకల వసతులు కల్పించడంతో కొత్త కాంతులు సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుతో పామెన గ్రామ రూపురేఖలు మారాయి. ఒకప్పుడు కనీస సౌకర్యాలకు నోచుకోని ఈ గ్రామం ఇప్పుడు 30 గుంటల భూమిలో వైకుంఠధామం, 20 గుంటల్లో ప్రకృతి వనం, నాలుగు గుంటల్లో డంపింగ్ యార్డు నిర్మించారు. వీటితోపాటు పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్, ట్రాలీ, మొక్కలకు నీటిని అందించేందుకు ట్యాంకర్ కొనుగోలు చేశారు. నర్సరీలో మొక్కల పెంపకం వంటి వసతులతో పామెన ప్రగతి పథంలో దూసుకుపోతున్నది.
కంపోస్టు ఎరువు తయారు
పల్లెప్రగతిలో భాగంగా పామెన గ్రామంలో డంపింగ్యార్డు ఏర్పాటుచేశారు. పంచాయతీ నిధులతో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. గ్రామంలో నాటిన మొక్కలకు ఈ ఎరువును వినియోగిస్తున్నారు. గ్రామంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాలతో గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు, దోపిడీలు జరుగకుండా అరికట్టేందుకు వీలుంటుంది.
అందరి సహకారంతో మరింత అభివృద్ధి
గ్రామస్తుల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రకృతి వనంలో అన్ని రకాల మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నాం. ట్రాక్టర్ సహాయంతో గ్రామంలో ప్రతిరోజు చెత్తను సేకరించడంతోపాటు ట్యాంకర్ సాయంతో హరితహారం మొక్కలకు నీరు పోస్తున్నాం.
గ్రామస్తుల సహకారంతోనే ..
ఉన్నతాధికారుల అదేశాల మేరకు పామెన గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా అన్ని పనులు సకాలంలో పూర్తిచేశాం. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టాం. హరితహారంలో నాటిన మొక్కలను ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నాం.
-బి.ప్రమోద్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, పామెన