‘ఇరుగుపొరుగువారైన ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య పరిచయం నుంచి పెళ్లి వరకు జరిగే ప్రయాణానికి అందమైన దృశ్యరూపమే ‘రంగ్దే’. మానవోద్వేగాలు సప్తవర్ణాలకు ప్రతీక అని తెలియజెప్పేలా ఈ టైటిల్ పెట్టాం’ అని అన్నారు వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘సున్నితమైన భావోద్వేగాలతో వినోదం కలబోతగా సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. పక్కపక్క ఇళ్లలో ఉండే అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏం జరిగిందన్నదే చిత్ర ఇతివృత్తం. వారిద్దరి మధ్య దోబూచులాడే ప్రేమ, కోపం తాలూకు ఉద్వేగాలతో ఆద్యంతం హృద్యంగా సాగుతుంది. ప్రథమార్థం వినోదప్రధానంగా, ద్వితీయార్థం హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో మెప్పిస్తుంది. పతాకఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. నితిన్, కీర్తిసురేష్ తమ పాత్రలతో సహానుభూతి చెంది నటించడంతో తెరపై ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పండింది. నితిన్ సింగిల్ సిట్టింగ్లో ఈ కథ ఓకే చేశారు. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్గారు ఛాయాగ్రాహకుడిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. కథ బాగా నచ్చడంతో ఆయన ఈ సినిమాకు ఒప్పుకొన్నారు. దేవిశ్రీప్రసాద్ కథానుగుణంగా అద్భుతమైన పాటలిచ్చారు. నేపథ్య సంగీతం సినిమాలోని మూడ్ను ఎలివేట్ చేసేలా ఉంటుంది. నా తదుపరి చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, దిల్రాజు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రేమకథ కాకుండా సరికొత్త సబ్జెక్ట్ను సిద్ధం చేసుకున్నా. కథానాయకుడెవరనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తా’ అన్నారు.