సూర్యాపేట, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. నేడు జరిగే ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్లను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో లెక్కించనున్నారు. నాలుగు నియోజకవర్గాలకు 64 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గతంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను మాత్రమే ఏర్పాటు చేయగా.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఫలితాలు ఒకే సారి పూర్తయ్యేలా అవసరమైతే అదనపు టేబుళ్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.
దాంతో నాలుగు నియోజకవర్గాలకు కలిపి 2018లో 56 టేబుళ్లను ఏర్పాటు చేయగా ఈ సారి మరో 8 అదనంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 1201 పోలింగ్ బూత్లు ఉండగా సూర్యాపేటలో 271 పోలింగ్ బూత్లల కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు, తుంగతుర్తిలో 326 పోలింగ్ బూత్లకు 18, కోదాడ 296 పోలింగ్ కేంద్రాలకు 16, హుజూర్నగర్లో 308 కేంద్రాలకు 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు ఈ సారి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల కౌంటింగ్ ఒకేసారి ప్రారంభించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ఓటర్ల సంఖ్యను బట్టి టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
సూర్యాపేటలో 6, కోదాడలో 5, తుంగతుర్తిలో 3 టేబుళ్లను ఏర్పాటు చేయగా హుజూర్నగర్ కోసం 4 మొత్తం 18 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు ఆయా పార్టీల ఏజెంట్లతో పాటు సర్వీస్ అందించేందుకు 50 మంది రెవెన్యూ సిబ్బంది ఉంటారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ మూడంచెల భధ్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం మొత్తాన్ని అనువనువూ క్షుణంగా పరిశీలించేందుకు కౌంటింగ్ కేంద్రంలో, బయట అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.