యాదాద్రి భువనగిరి, మే 11 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లోని మహిళలకు పౌష్టికాహారం అందడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా గర్భిణులు, గర్భంలోని శిశువుల రక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. అయితే ఇప్పటికే తొమ్మిది జిల్లాలో ఈ పథకం అమలవుతుండగా, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. నెలాఖరులోగా యాదాద్రిభువనగిరి జిల్లాలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు చేరాయి. జిల్లాకు వివిధ ఆస్పత్రులకు 1,462 కిట్లు వచ్చాయి. భువనగిరి ఏరియా ఆస్పత్రికి 724, రామన్నపేటకు 183, చౌటుప్పల్కు 350, ఆలేరుకు 205 కిట్లు చేరాయి. ప్రస్తుతం వీటిని ఆయా ఆస్పత్రుల్లో ప్రత్యేక గదుల్లో నిల్వ చేశారు. ఎలుకలు, ఇతర కారణాలతో పాడైపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
మరో 3వేల కిట్ల రాక..
ప్రస్తుతం జిల్లాలోని కేంద్ర, ఏరియా ఆస్పత్రులకు మాత్రమే న్యూట్రిషన్ కిట్లు వచ్చాయి. అయితే అతి త్వరలోనే జిల్లాలోని 21 పీహెచ్సీలకు కూడా కిట్లు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో పీహెచ్సీకి సుమారు 100 పైగానే రానున్నట్లు పేర్కొంటున్నారు. గర్భిణికి రెండుసార్లు న్యూట్రిషన్ కిట్లను అందించనున్నారు. రెండో చెకప్, మూడో చెకప్ సమయంలో కిట్లను ఇవ్వనున్నారు. అయితే పథకం ప్రారంభించే రోజు మొదటగా మూడో చెకప్కు వచ్చే గర్భిణులకు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో చెకప్ సమయంలో పీహెచ్సీల్లో, మూడో చెకప్ సమయంలో ఏరియా ఆస్పత్రుల్లో అందించనున్నారు.
రూ.1,962 విలువైన కిట్..
రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో రక్తం తక్కువగా ఉండి తల్లీ బిడ్డలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీని వల్ల ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. రక్తహీనతను నివారించడం వల్ల మాతృ మరణాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండే పోషహకారం ద్వారా రక్తహీనత తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం కిట్ల లక్ష్యం. అయితే మాతా, శిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. తాజాగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తీసుకొచ్చింది. రూ.1,962 విలువైన కిట్తో బలవర్ధకమైన పోషకాహారాన్ని అందించనున్నది. కిట్లో ఏడు రకాల వస్తువులు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,467 మంది గర్భిణులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.