నేరేడుచర్ల, జూలై 16 : మండల సమగ్ర అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని ఎంపీపీ లకుమళ్ల జ్యోతి కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూలైలో 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.15, 84,550 లక్షలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.8,90,382 లక్షలు కేటాయించిందని తెలిపారు. ఏడాది గడుస్తున్నా అధికారులు ఆయా గ్రామాల వారీగా ఎంపీటీసీలకు నిధులు కేటాయించక పోవడంతో వృథాగా ఉన్నాయని పెంచికల్దిన్నె ఎంపీటీసీ లింగయ్య సభ దృష్టికి తీసుకొచ్చారు. మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రం నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా ప్రజల నుంచి వసూళ్లు చేస్తున్నారని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యులు తాసీల్దార్ సరితను కోరారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా ఉందని, ఎంపీటీసీలు అంటే అధికారులకు లెక్కలేదని, తమ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరం లేకుండా ఏప్రిల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని రద్దు చేయాలని, పెండింగ్లో ఉంచిన నిధులను తక్షణమే ప్రాదేశిక సభ్యులందరికీ సమానంగా కేటాయింపులు జరిపి అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ లింగయ్య తీర్మానం ప్రవేశపెట్టగా మేడారం ఎంపీటీసీ రాజేశ్ బలపర్చారు. దీంతో సభ మొత్తం ఏకగ్రీవ తీర్మాణం చేయగా ఎంపీఓ విజయకుమారి ఆమోదించారు. అనంతరం శాఖల వారీగా అధికారులు ప్రగతి నివేదికలను వివరించారు. దళిత సాధికారత పథకాన్ని ప్రశంసిస్తూ జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.