నల్లగొండ మహిళా ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి
ఉదయం 8 గంటలకు ప్రారంభం
4 టేబుళ్లు… ఒక్కటే రౌండ్లో లెక్కింపు
ఉదయం 11 గంటల వరకు తుది ఫలితం
విజయంపై సంపూర్ణ విశ్వాసంతో టీఆర్ఎస్
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్లగొండలోని మహిళా సమాఖ్య భవనం(మహిళా ప్రాంగణం)లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం సిబ్బందిని ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ, జిల్లా ఎస్పీ రంగనాథ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ సిబ్బందితో కలిసి మాక్ కౌంటింగ్ సైతం నిర్వహించారు. కౌంటింగ్ కోసం ఒకే హాల్లో నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు.
నాలుగు టేబుళ్లపై కౌంటింగ్…
కౌంటింగ్ కోసం మొత్తం నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు ఐదుగురు సిబ్బందిని నియమించారు. రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. కౌంటింగ్ సిబ్బందితోపాటు ఏజెంట్లు ఉదయం 6.30 గంటల వరకు కౌటింగ్ కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకు అభ్యర్థ్ధులు లేదా ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను తెరిచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్కు తీసుకువస్తారు. ఒక్కో టేబుల్కు రెండు బ్యాలెట్ బాక్సులు కేటాయిస్తారు. వీటిలోని బ్యాలెట్ టేబుళ్లపై ప్రత్యేక ట్రేల్లో పోస్తారు. ఇలా నాలుగు టేబుళ్లపై ఒకేసారి ఎనిమిది బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేస్తారు. అనంతరం 25 బ్యాలెట్ పత్రాలను ఓ కట్టగా కట్టి విభజిస్తారు. తర్వాత వీటిని లెక్కింపు కోసం టేబుళ్లకు పంపుతారు.
ఒకటే రౌండ్లో లెక్కింపు..
మొత్తం 1,271 ఓట్లు ఉండగా 1,233 ఓట్లు పోలయ్యాయి. ఒకటే రౌండ్లో లెక్కింపు పూర్తయ్యేలా బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేయనున్నారు. మొదటి మూడు టేబుళ్లల్లో ఒక్కో టేబుల్కు 300 (12కట్టలు) చొప్పున చివరి టేబుల్కు మిగిలిన 333 బ్యాలెట్ పత్రాలను కేటాయిస్తారు. ఇలా తొలి ప్రాధాన్యం ఓట్లు లెక్కించనున్నారు. ఒకటే రౌండ్లో మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయ్యాక మొత్తం ఓట్లలో చెల్లిన ఓట్లను, చెల్లని ఓట్లను లెక్కిస్తారు. చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్లలో గెలుపు కోటా నిర్ధారిస్తారు.
గెలుపు కోటా.. 50శాతం ప్లస్ వన్..
చెల్లని ఓట్లను తీసివేయగా మిగిలిన ఓట్లలో నుంచి గెలుపు కోటా నిర్ధారిస్తారు. చెల్లిన ఓట్లలో 50 శాతం ప్లస్ వన్ కలిపి గెలుపు కోటాగా భావిస్తారు. ఉదాహరణకు 1200 చెల్లిన ఓట్లు అనుకుంటే 600 (50శాతం)+ 1=601 ఓట్లు గెలుపు కోటా అవుతుంది. ఇలా ఓట్ల లెక్కింపులో తొలి ప్రాధాన్యం లెక్కింపు పూర్తయ్యే సరికి ఏ అభ్యర్థయినా గెలుపు కోటా ఓట్లను సాధిస్తే అతడినే విజేతగా ప్రకటిస్తారు. తర్వాత రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు అవసరం ఉండదు. ఒకవేళ చేయాల్సి వస్తే అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థ్దిని ఎలిమినేట్ చేస్తూ అతడి బ్యాలెట్లల్లో ఉన్న ద్వితీయ ప్రాధాన్యం ఓట్లను ఇతర అభ్యర్థ్ధులకు పంచుతారు. ఇలా దిగువ నుంచి తక్కువ ఓట్లు సాధించిన వారిని ఎలిమినేట్ చేస్తూ మిగతా వారికి ఓట్లను కలుపుతూ వస్తారు.
తొలి ప్రాధాన్యంలోనే విజేత తేలే చాన్స్..
తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపుతోనే విజేత ఎవరో తేలిపోయే అవకాశముంది. మొత్తం ఓటర్లలో టీఆర్ఎస్కు చెందిన వారే 820 మంది ఉన్నారని ఆ పార్టీ నేతలు లెక్కలు తేల్చారు. వీరితోపాటు విపక్షాల ఓటర్లు సైతం టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థ్ధులు బరిలో లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐలకు చెందిన ఓటర్లు సైతం తమ వైపు మొగ్గు చూపారని టీఆర్ఎస్ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఇదే జరిగితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి తొలి ప్రాధాన్యం ఓట్లతోనే విజయం సాధించే అవకాశం ఉంది. ఉదయం 11గంటల వరకే తుది ఫలితం రావచ్చని అంచనా. ఇదే విషయంపై రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ మధ్యాహ్నం 12గంటల వరకు కౌంటింగ్ పూర్తికావచ్చన్నారు. ఎలిమినేషన్ రౌండ్కు వెళ్లాల్సి వస్తే అదనంగా గంట సమయం పట్టొచ్చని చెప్పారు.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి : ఆర్వో
కౌంటింగ్ ప్రక్రియలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరి చేశాం. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థ్ధులు, ఏజెంట్లు, మీడియా సిబ్బంది రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించుకున్నట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలి. లేదా కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో కొవిడ్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలి. కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ రంగనాథ్తో కలిసి పరిశీలించాం. కౌంటింగ్ను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.