ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు బుధవారం ముగిశాయి. నల్లగొండ మేకల అభినవ్ స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి జనవరి 4వరకు సెలవు దినాలు మినహా 23 రోజులపాటు సాగిన ఈవెంట్స్లో 23,524 మంది అభ్యర్థులకు 12,124 మంది (51.53 శాతం) మెయిన్స్కు అర్హత సాధించారు. ఇందులో పురుష అభ్యర్థులు 9,235 మంది, మహిళా అభ్యర్థులు 2,889 మంది ఉన్నారు.
నీలగిరి, జనవరి 4 : పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థ్ధులకు డిసెంబర్ 8 నుంచి నిర్వహిస్తున్న ఈవెంట్స్ బుధవారం ముగిశాయి. 23 రోజుల పాటు నిర్విరామంగా జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో కొనసాగిన పరీక్షల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా నిర్వహించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ప్రిలిమినరీ రాత పరీక్షల్లో 26,433 మంది అర్హత సాధించగా 23,524 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 12,124 మంది అర్హత సాధించగా 9,235 మంది పురుషులు 4,830 మంది మహిళలు ఉన్నారు. చివరి రోజు 1,200 మంది హాజరు కావాల్సి ఉండగా 1,073 మంది హాజరయ్యారు. ఇందులో 517 మంది అర్హత సాధించారు.
ప్రిలిమ్స్లోఅర్హత సాధించిన ఎస్ఐ, కాని స్టేబుల్ అభ్యర్థులకు జిల్లా పోలీస్ యంత్రాంగం డిసెంబర్ 8 నుంచి జనవరి 4 వరకు సెలవు దినాల్లో మినహాయించి 23 రోజుల పాటు నిర్విరామంగా దేహదారుఢ్య పరీక్షలు కొనసాగాయి. ముందుగా రెండు రోజులు పురుషులకు నిర్వహించి మిగిలిన నాలుగు రోజులు మహిళలు, ఒక రోజు డ్రైవర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు, ఎక్స్సర్వీస్ మన్లు, మిగిలిన 18 రోజుల పాటు పురుషులకు పరీక్షలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలను నిర్వహించారు. ప్రతి రోజూ 1200 మందిని టార్గెట్గా పెట్టుకోగా పరీక్షకు సమయం ఇచ్చిన రానివారికి సైతం కూడా తిరిగి సమయం కేటాయించి పరీక్షలు నిర్వహించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోలీస్ ఉద్యోగాల కోసం అర్హత సాధించిన 26,433 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్తో పాటు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాల్సిండగా అందులో 23,524మంది హాజరయ్యారు. వీరిలో 11,400 మంది నిష్క్రమించగా 12,124 మంది అర్హత సాధించారు. అత్యధికంగా పరుగుపందెం పోటీల్లోనే 6,263 మంది వెనుదిరుగగా 17, 261మంది అర్హత సాధించారు. హైజంప్లో 22, 292 అర్హత సాధించగా 1,232 మంది డిస్ క్వాలిఫై అయ్యారు. లాంగ్జంప్లో 19,165 మంది అర్హత సాధించగా 4,359 మంది, షార్ట్పుట్లో 22,333 మంది అర్హత సాధించగా 1,191 మంది వెనుదిరిగారు.
ఈవెంట్స్ పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రతి ఈవెంట్ వద్ద బయో మెట్రిక్ పద్ధతిని అమలు చేయడంతో పాటు ఆర్ఎఫ్ఐడీ( radio frequency identification reader) ద్వారా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తూ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా సీసీ కెమెరాలో రికార్డు చేశారు. భవిష్యత్లో ఏమైనా విమర్శలు వస్తే సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే వారిని గ్రౌండ్లోకి అనుమతి ఇచ్చారు.
ఈవెంట్స్ను ఎలాంటి అటంకాలు ఇబ్బందుల్లేకుండా పారదర్శకంగా నిర్వహిం చాం. ఎంపిక ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు చేశాం. సాంకేతిక పరిజ్ఞానం నిపుణుల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించాం. ఈవెంట్స్ను విజయవంతంగా నిర్వహించిన పోలీస్ యంత్రాంగానికి అభినందనలు.
-రెమా రాజేశ్వరి, ఎస్పీ