సూర్యాపేట, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో వెనుకబడిన సూర్యాపేట ప్రాంతం స్వరాష్ట్రంలో జిల్లాగా ఏర్పడి సమగ్రాభివృద్ధి చెందుతున్నది. ఆరేండ్లలోనే కనీవిని ఎరుగని రీతిలో రూ.10,108 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం గమనార్హం. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అభివృద్ధి, సంక్షేమాలే కాదు.. ఆహ్లాదంతో పాటు అన్నీ సమాంతరంగా జనానికి అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని అనేక ప్రజా సమస్యలను వేల కోట్లు వెచ్చించి పరిష్కరించారు. దీనిని ప్రతిపక్షాలు సైతం అంగీకరిస్తున్నాయి. విద్య, వైద్యం, తాగు, సాగునీటితో పాటు వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు, మినీట్యాంక్ బండ్లు, చెరువుల ఆధునీకరణ, రహదారులు ఇలా అన్నీ గ్రామాలు, పట్టణాల్లో సమకూరాయి. ఈ లెక్కన చిన్న జిల్లాల ఏర్పాటు సార్థకత సమకూరుతుందని చెప్పొచ్చు.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎటు చూసినా అభివృద్ధి ఆనవాళ్లు కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తున్నాయి. గతంలో ఊర్లకు వెళితే గ్రామ గుమ్మాల్లో గత రాజకీయ పార్టీల హత్యాకాండలకు జ్ఞాపకార్థాలు, స్థూపాలు కనిపించగా.. నేడు స్వచ్ఛమైన సాగునీటిని అందించేందుకు జిల్లాలో రూ.970 కోట్లతో పూర్తి చేసిన మిషన్ భగీరథ ట్యాంకులు దర్శనమిస్తున్నాయి. దాదాపు రూ.2200 కోట్లు వెచ్చించి గ్రామాల నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు రహదారులతో పాటు గ్రామాలు, పట్టణాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడం, జిల్లాలోని కాల్వలు, తూములు మరమ్మతులకు నోచుకోవడంతో పాటు మూసీ నది ఆధునీకరణ, కాల్వల మరమ్మతులు చేయడం, నాగార్జునసాగర్ నీటిని హక్కుగా వాడుకుంటుండడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
జిల్లాలో దాదాపు 6.15 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ప్రస్తుతం 6 లక్షల ఎకరాల వరకు సాగవుతున్నది. ఇక జిల్లాలో 400 కేవీ సబ్స్టేషన్తో పాటు 220, 132 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటు, మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు తదితరాల కోసం దాదాపు రూ.3200కోట్లకు పైనే వెచ్చించడంతో చిన్న ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా అవుతున్నది. సీజన్కు ముందే రైతుబంధు ఇస్తుండడంతోపాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేలా చూస్తున్నారు. దీంతో వ్యవసాయం పండుగలా మారింది. విద్య, వైద్య రంగాలకు కొదవే లేకుండా నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. ఇలా జిల్లాలో ఆరేండ్ల కాలంలోనే సంక్షేమం కాకుండా అభివృద్ధి కోసమే రూ.10,108 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.