దేశంలోనే సంచలనం, చరిత్రాత్మకం కాబోతున్న రేపటి ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం కోసం సూర్యాపేట జిల్లాలో భారీ ప్రణాళికలు జరిగాయి. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి 1.20 లక్షల మందిని తరలించేందుకు పార్టీ సన్నద్ధమైంది. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు చేసిన ప్రణాళికలకు మించిన పట్టుదలతో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే జిల్లా, నియోజకవర్గాల స్థాయి సమావేశాలు పూర్తి కాగా సోమవారం మండల, గ్రామాల వారీగా సమావేశాలు జరిగాయి. సభ విజయవంతం చేయాలని ఎంపీ, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ పిలుపునిచ్చారు. ఎనిమిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న లబ్ధిదారులు సైతం స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
సూర్యాపేట, జనవరి 16 (నమస్తే తెలంగాణ): దేశంలో సంచలనం సృష్టించబోతున్న ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతం కోసం సూర్యాపేట జిల్లా భాగస్వామ్యం కాబోతున్నది. ఖమ్మం సభకు ఐదు లక్షల మంది జనం వస్తారని పార్టీ అంచనాలు వేస్తుండగా సూర్యాపేట జిల్లా నుంచే 1.20 లక్షల మంది తరలి వెళ్లనున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్తో పాటు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావులతో పాటు ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనాన్ని తరలించేందుకు గ్రామ స్థాయి వరకు సమన్వయ సమావేశాలు నిర్వహించి వాహనాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి 30 వేల చొప్పున మొత్తం 1.20లక్షల మంది తరలి వెళ్లెలా ప్రణాళికలు సిద్ధ చేశారు.
స్వచ్ఛందంగా తరలేందుకు సన్నాహాలు
కాగా ఎక్కడైనా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు జరిగినా ఆయా పార్టీల శ్రేణులు మాత్రమే వెళ్తారు కానీ బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో సంతోషంగా ఉన్న సాధారణ జనం సైతం స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారితే జనంలో కన్ఫ్యూజన్ వస్తుందని, తెలంగాణ పదం పార్టీలో లేకుండా పోవడంతో ఆ పార్టీకి నష్టం వాటిళ్లడం ఖాయమంటూ కొంతమంది వ్యక్తపరుస్తున్న అనుమానాలు పటాపంచలవుతున్నాయి.
అసలు తాము జిల్లాలో పార్టీని మాత్రమే చూడడం లేదు… రాష్ట్ర స్థాయిలో కేసీఆర్, జిల్లా స్థాయిలో మంత్రి జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలను చూసుకుంటూ పార్టీ పేరు మారినా తమకు ఎలాంటి అసంతృప్తి లేదు.ఉండదు. మాకు వచ్చే సంక్షేమ పథకాలు ఆగలేదని లబ్ధిదారులు అంటున్నారు. గతంలో ఏమాత్రం గుర్తింపు లేని తెలంగాణ ప్రాంతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది మిరుమిట్లు గొలిపేలా చేయడం పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నాము. తెలంగాణ మాదిరి యావత్ దేశానికి విద్యుత్ వెలుగులు, తాగు, సాగునీటితో పాటు అన్ని పథకాలు అమలై ప్రపంచంలోనే భారత్ అబివృద్ధి చెంది అత్యున్నత గౌరవం పొందాలంటే దేశ రాజకీయాల్లో కేసీఆర్ భాగస్వామ్యం అవసరం అంటున్నారు.
అందుకే ఖ మ్మంలో జరుగబోయే బీఆర్ఎస్ సభ దేశ వ్యాప్తంగా చర్చ జరుగడానికి సభ విజయవంతం కావాల్సిందే… దీనికి తాము కూడా బీఆర్ఎస్ సభకు స్వచ్ఛందంగా తరలి వెళబోతున్నామంటూ పార్టీకి సంబంధం లేని లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. దాంతో జిల్లా నుంచి 1.20 లక్షల మందిని తరలించాలనుకునే సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తున్నదని… వా హనాలను సమకూర్చడం అనేది ఇబ్బందికరంగా మారుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
దేశ్ కీ నేత కేసీఆర్ కావాల్సిందే
సీఎం కేసీఆర్ను దేశ ప్రజలంతా దేశ్ కా నేత కావాలని కోరుకుంటున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. దేశం బాగుండాలన్నా తెలంగాణ ప్రజలకు అందుతున్న ప్రతి సంక్షేమ పథకం దేశ ప్రజలకు అందాలన్నా తప్ప కుండా కేసీఆర్ నాయకత్వం దేశానికి చాలా అవసరం. నాడు అనాథగా ఉన్న తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి నేడు దేశానికి దిక్సూచిగా మార్చిండు. అలాగే నేడు దేశాన్ని, దేశ ప్రజలను కేసీఆర్ బాగు చేసి అభివృద్ధ్ది పథంలో నడిపిస్తాడనే నమ్మకంతో ప్రజలంతా బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. కేసీఆర్ దేశ్ కీ నేత కచ్చితంగా అవుతాడు.
– కుంభం కరుణాకర్, సర్పంచ్, నాగారం బంగ్లా
భారీగా తరలి వెళ్తాం
ఖమ్మం సభ బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించబోతున్నది. దేశంలో బీజేపీ దుర్మార్గ పాలన, రాష్ర్టాలపై చూపుతున్న వివక్షను ఏక పక్షంగా ఎదుర్కొంటోంది. ఒక్క తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే. కేంద్రం చిన్న చూపు చూస్తున్న ఇతర రాష్ర్టాల సీఎంలు అక్కడి పార్టీల నేతలు కేసీఆర్తో కలిసి రావాల్సిన సమయం అసన్నమైనది. మా అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చింది. లక్షల్లో తరలి రానున్న ఖమ్మం సభతో దేశం చూపు బీఆర్ఎస్ పార్టీపై పడడం ఖాయం
– కడియాల రమేశ్, బీఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి, లింగగిరి (హుజూర్నగర్రూరల్)