నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్21(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై ఇప్పటికే పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తున్నది. జిల్లాల్లో విక్రయాలు, కొనుగోళ్లపై గట్టి ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు గంజాయి, దాని అనుబంధ మత్తు ఉత్పత్తుల రవాణా కోసం జిల్లా మీదుగా వెళ్తున్న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని వినియోగిస్తున్నారు. పోలీసులు కూడా దీనిపై ప్రత్య్కే నిఘా పెట్టి ముఠా ఆగడాలకు చెక్ పెడుతూనే ఉంది. అయితే ఇటీవల చిన్నారిపై లైంగికదాడి, హత్య ఘటనతో ప్రభుత్వం ఈ విషయమై మరింత కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్నిచోట్ల పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘాను పటిష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల రవాణాను అడ్డుకునే విధంగా చర్యలు చేపట్టారు. తర్వాత విక్రయాలను, అందుకు కారకులు, ఏయే ప్రాంతాల్లో యువకులు మత్తుకు బానిసలుగా మారుతున్నారు లాంటి అంశాలపై మరింత నిఘా పెట్టారు. ఇదే సమయంలో గతంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో సంబంధం ఉన్న వారిపైనా కన్నేసి ఉన్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో కొందరు యువకులు అదేపనిగా గుమికూడడం వంటి వాటిపైనా దృష్టి సారించనున్నారు. విద్యాసంస్థల పరిసరాల్లోనూ నిఘా పెంచనున్నారు. మత్తు వదిలేదాక మరింత కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని, ఎక్కడికక్కడ మత్తుబాబుల ఆటకట్టించాలని నిర్ణయించారు.
మూడు కేసుల ఛేదింపు
నల్లగొండ జిల్లాలో వేర్వురు ప్రాంతాలకు సంబంధించిన మూడు కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మూడు కేసులు మూడు రకాల మత్తు పదార్థాలకు సంబంధించినవి కావడం గమనార్హం.
ప్రజలు సమాచారం ఇవ్వాలి : ఎస్పీ రంగనాథ్
జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని ఇటీవలే సీఎం, డీజీపీల నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు గంజాయి స్మగ్లింగ్పై ప్రత్యేక నిఘాతో పనిచేస్తున్నాం. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న మత్తు పదార్థాలపై కూపీ లాగుతున్నాం. హైవేలపై తనిఖీలు మరింత పటిష్టం చేశాం. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి కూడా సహకారం తీసుకుంటాం. అన్నివైపుల నుంచి నిరంతరం నిఘాతో పాటు పటిష్టమైన చర్యలకు ప్రణాళిక సిద్ధం చేశాం.
విడాయిల్, గంజాయి విక్రయ ముఠా అరెస్టు
నీలగిరి, సెప్టెంబర్ 21 : గంజాయి నుంచి విడాయిల్ వంటి మత్తు పదార్థం తయారు చేస్తున్న, పెయిన్ కిల్లర్స్, గంజాయి రవాణా వంటి కేసుల్లో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు స్పీ రంగనాథ్ తెలిపారు. వీరి నుంచి విడాయిల్, 25 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాట్లాడారు., స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి దొరకక హైడోస్ పెయిన్ కిల్లర్స్ వాడేందుకు ప్రోత్సహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
గంజాయితో విడాయిల్ తయారీ
గంజాయితో విడాయిల్ వంటి మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న ముఠాను వన్టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వైజాక్ అరకు ప్రాంతానికి చెందిన కిల్లో సురేశ్, హైదరాబాద్కు చెందిన షెక్ మహబూబ్ అలీ విడాయిల్ను నల్లగొండలో విక్రయించేందుకు రాగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి లీటర్ విడాయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఒక లీటర్ విడాయిల్ ధర రూ. 40 వేల వరకు ఉంటుందని, 10 మిల్లీ లీటర్ల చమ్కి డబ్బాలో దీనిని పోసి రూ. 3 నుంచి 4వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరి నుంచి యాక్టివాతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.
గంజాయి ముఠా అరెస్టు
మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. హైదరాబాద్లోని కొత్తపేట ప్రాంతానికి చెందిన పోతుగంటి అనిల్కుమార్, హయత్నగర్కు చెందిన ఉతాది జ్ఞానేశ్వర్ అలియాస్ గణేశ్, మిర్యాలగూడకు చెందిన సైదిరెడ్డి అలియాస్ బబ్బుకు గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారికి సహకరిస్తున్న తూర్పు గోదావరి జిల్లా సింధువాడకు చెందిన పంగి విశ్వనాథ్ అలియాస్ ప్రదీప్, బచ్చులూరుకు చెందిన వేమా జాన్రెడ్డిలను ఆదుపులోకి తీసుకొని 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.
హైడోస్ పెయిన్ కిల్లర్స్..
నల్లగొండ పట్టణంలో వైద్యుల అనుమతి లేకుండా హై డోస్ పెయిన్ కిల్లర్స్ను విక్రయిస్తూ పలువురిని ఆ మందుకు బానిసలుగా మారుస్తున్న వారిని వన్టౌన్ సీఐ బాలగోపాల్ అరెస్టు చేశారు. పట్టణంలోని కాపురాల గుట్ట వద్ద కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు వెళ్లి మత్తులో ఉన్న ఎండీ గౌస్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా స్పాస్మో ప్రోగ్జివాన్ ప్లస్ అనే ట్లాబ్లెట్స్ను వాడినట్లు తెలిపారు. ప్రకాశం బజార్లోని రాజా మెడికల్ హాల్ నిర్వాహకుడు దుస్సా జనార్దన్ డాక్టర్ ప్రిస్కిక్షన్ లేకుండా సదరు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలడంతో అతడిని కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. సమావేశంలో డీటీసీ ఎస్పీ సతీశ్ చోడగిరి, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, వన్టౌన్ సీఐ బాలగోపాల్, టాస్క్ఫోర్సు సీఐ రౌతు గోపి, మిర్యాలగూడ సీఐ సదానాగరాజు పాల్గొన్నారు.