సొంతింటి కలను నేరవేర్చిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పండుగలా జరుపుకుంటామంటున్న లబ్ధిదారులు
సూర్యాపేట, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఇండ్లంటే పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తున్నాయి. రెండు బెడ్రూమ్లు, కిచెన్, రెండు టాయిలెట్లు, హాల్తో కూడిన విశాలమైన ఇండ్లు. పూర్తి సబ్సిడీతో నిర్మించడంతో పాటు విద్యుత్, తాగు నీరు, డ్రైనేజీ, పలు చోట్ల గ్యాస్ కనెక్షన్ సైతం అందించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్ల బజార్లోని 192 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న దసరా రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సరిగ్గా రెండేండ్లలో నిర్మాణాలు పూర్తి కాగా 2017 అక్టోబర్ 12న దసరా మరుసటి రోజున సీఎం కేసీఆర్ స్వయంగా విచ్చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. ఎలాంటి పైరవీలు లేకుండా, నయా పైసా వెచ్చించకుండా ఇండ్లు దక్కిన వారంతా సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పండుగలా జరుపుకొంటున్నామని సంతోషంతో చెప్తున్నారు.
మా ఇంటి దేవుడు కేసీఆర్..
కిరాయి ఇంట్లో ఉంటూ పూట గడిచే పరిస్థితి లేని మాకు పైసా ఖర్చు లేకుండా సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారు. ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం సారు మొదటగా మాతోనే గృహ ప్రవేశం చేయించారు. మా ఆనందానికి అంతేలేదు. ఆ రోజును జీవితంలో మర్చిపోలేం. ఇంటి అద్దె బాధ తప్పడంతో మిగిలిన డబ్బులను పొదుపు చేసుకుని పిల్లలను బాగా చదవిస్తున్నాం. గతేడాది నా భర్త చనిపోయినప్పటికీ ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా ధైర్యంగా ఉంటున్నామంటే అది సీఎం కేసీఆర్ సార్ చలువే. ఇల్లు కేటాయించి దగ్గరుండి గృహ ప్రవేశం చేయించిన మా ఇంటి దేవుడు కేసీఆర్.
– జాజుల దుర్గాభవాని, లబ్ధిదారు, సూర్యాపేట