ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారంగా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది. అప్పట్లో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున పరిహారంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఆ హామీ మేరకు గురువారం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి మొత్తం 17,048 మంది రైతులకు 19,672.08 ఎకరాలకు సంబంధించిన రూ. 19.67 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అందనున్నాయి. ఈ పరిహారం డబ్బు రైతుబంధు తరహాలోనే నేరుగా పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఒకట్రెండు రోజుల్లో జమ కానున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పరిహారం అందిస్తుండడంతో అకాల వర్ష బాధిత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, జూలై 6(నమస్తే తెలంగాణ): ఈ ఏడాది మార్చి 22 నుంచి ఏప్రిల్ 27వ తేదీ మధ్యలో పలు దఫాలుగా కురిసిన గాలి వాన, వడగండ్లతో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చే దశలో ఈ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలుగజేశాయి. దాంతో తీవ్ర ఆవేదనలో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో స్వయంగా పర్యటించి క్షేత్రస్థాయిలో రైతుల వెతలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ మార్చితో పాటు ఏప్రిల్ 3,4, 21, 22, 23, 24, 25 తేదీల్లోనూ అకాల వర్షాలు కురిశాయి. పలు మండలాల్లో వరితో పాటు మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నా యి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లా అధికారులు పంట నష్టంపై క్షేత్రస్థాయి సమగ్ర సర్వేను చేపట్టారు. కలెక్టర్ల పర్యవేక్షణలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు కలిపి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ అంచనాలను రూపొందించారు. ఉమ్మడి జిల్లాలోని యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వడగండ్లతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతినగా నల్లగొండ జిల్లాలో ఓ మాదిరిగా నష్టం వాటిల్లింది. దీని ప్రకారమే అధికార యంత్రాంగాలు నష్టపోయిన పంటలను రైతుల వారీగా ఎన్ని ఎకరాలు, ఏఏ పంటలు అని క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేశారు.
సూర్యాపేటలో అధికంగా…
అకాల వర్షాలతో సూర్యాపేట జిల్లాలో ఎక్కువ నష్టం వాటిల్లింది. తర్వాత యాదాద్రిభువనగిరి, తర్వాత నల్లగొండ జిల్లాలో పంటలకు నష్టం జరిగింది. సూర్యాపేట జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రైతులకు పరిహారం మంజూరైంది. ఇక్కడ మొత్తం 11,508.22 ఎకరాల్లో 10,188 మంది రైతులకు చెందిన పంటలకు నష్టం వాటిల్లినట్లు తేలింది. ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఈ జిల్లాలో మొత్తం రూ. 11.50 కోట్ల ఇన్పుట్ సబ్సిడీగా నష్టపోయిన రైతులకు అందనున్నాయి. తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 4,451 రైతులకు సంబంధించిన 5207.37 ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు. దీనికి సంబంధించి రూ. 5.20 కోట్లు పరిహారంగా విడుదలయ్యాయి. ఇక నల్లగొండ జిల్లాలో మొత్తం 2,409 మంది రై తులు పంటలు నష్టపోయినట్లు స్పష్టమైంది. ఇక్క డ 2,955.29 ఎకరాలకు సంబంధించి రూ.2.95 కోట్లు రైతులకు పరిహారంగా అందనుంది.
నేరుగా రైతుల ఖాతాల్లోకి…
ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇవ్వనున్న పంట నష్టపరిహారం నేరుగా సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పంటలు నష్టపోయిన రైతులతో పాటు ఎవరైనా కౌలు రైతులున్నా వారికి కూడా ఈ పరిహారం అందనుంది. బ్యాంకు ఖాతాకు లింకు లేని రైతులు ఎవరైనా ఉంటే వారి వివరాలను సేకరించనున్నారు. ఇలా వివరాల సేకరణ అనంతరం రైతుబంధు తరహాలోనే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మధ్యదళారులకు, ఇతర వ్యక్తుల ప్రమేయానికి దూరంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా బాధిత రైతులకు చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశం. ఈ మేరకు ఒకటిరెండు రోజుల్లో పంట నష్టపరిహారం డబ్బులు నేరుగా బాధిత రైతులకు అందనున్నాయి. దాంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. గతంలో పంట నష్టపరిహారం అంటే దళారులు, మధ్యవర్తులే సగం నొక్కేసే వారన్నది నిజం. కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిర్ణయంతో నిజంగా నష్టపోయిన రైతులకు ప్రతి పైసా పరిహారం చేరనుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.